ఇమ్రాన్ ఖాన్ ఉక్కిరి బిక్కిరి - పార్టీ సభ్యులు ఓటింగ్ కు వెళ్లొద్దు : అవిశ్వాసం వేళ ఉత్కంఠ..!!
పాక్ ప్రధాని ఇమ్రాన్ తనకు వ్యతిరేకంగా జరుగుతున్న పరిణామాలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఇప్పటికే ఇమ్రాన్ పైన అవిశ్వాస తీర్మాన నోటీసు ఇచ్చారు. ప్రతిపక్షాలతో పాటుగా స్వపక్షానికి చెందిన సభ్యులు సైతం ఇమ్రాన్ కు వ్యతిరేకంగా స్వరం పెంచారు. ఈ నెల 31వ తేదీతో దీని పైన చర్చ ముగియనుంది. ఏప్రిల్ 3న ఓటింగ్ కు ఛాన్స్ ఉంది. ఆ రోజున జాతీయ అసెంబ్లీ సమావేశానికి దూరంగా ఉండాలని లేదా హాజరుకావద్దని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తన పార్టీ సభ్యులను ఆదేశించారు. పార్టీ అధ్యక్షుడిగా ఆయన తన సభ్యులను ఈ ఆదేశాలు ఇచ్చారు. పాకిస్తాన్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 63(A) యొక్క నిబంధన వెనుక ఉద్దేశాన్ని గుర్తుంచుకోవాలని ఆయన సూచించారు.

ఓటింగ్ చేస్తే చర్యలు తప్పవు
ఆర్టికల్ 63(A) ప్రకారం ఆదేశాలను ఉల్లంఘిస్తే అది ఫిరాయింపు చర్యలు తప్పవని హెచ్చరించారు. అవిశ్వాసం ఎదుర్కొంటున్న మూడవ ప్రధానిగా ఇమ్రాన్ ఇప్పుడు క్లిష్ణ పరిస్థితులను ఫేస్ చేస్తున్నారు. మార్చి 31న అవిశ్వాస తీర్మానంపై చర్చ జరుగుతుందని, ఆ తర్వాత ఏప్రిల్ 3న ఓటింగ్ లో ఇమ్రాన్ గెలుస్తారని అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్ రషీద్ తెలిపారు. ప్రధాని ఖాన్కు 342 మంది ఉన్న సభలో 172 ఓట్లు అవసరం. ఖాన్ మిత్రపక్షాలు ఇప్పటికీ అతనికి మద్దతు ఇవ్వడానికి కట్టుబడి లేనందున మరియు పాలక పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్లోని దాదాపు రెండు డజన్ల మంది చట్టసభ సభ్యులు తిరుగుబాటు చేయటంతో పరిస్థితులు తారు మారు అవుతున్నాయి.

విదేశీ శక్తుల ప్రమేయం ఉందంటూ
తన సంకీర్ణ ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్రలో విదేశీ శక్తులు ప్రమేయం ఉందని ఖాన్ ఆదివారం నాడు దేశ రాజధానిలో జరిగిన భారీ ర్యాలీలో ఇమ్రాన్ చెప్పుకొచ్చారు. పాకిస్థాన్ అప్పులు పెరిగి ఆర్థిక సంక్షోభం మొదలైంది. ద్రవ్యోల్బణం పెరిగింది. మరోవైపు సైన్యం కూడా ఆయనపై అసంతృప్తిగా ఉంది. దీంతో ఇమ్రాన్పై అసమ్మతి సెగ మొదలైంది.జాతీయ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. మరోవైపు ఇమ్రాన్పై సొంత పార్టీకి చెందిన ఎంపీలు కూడా తిరుగుబాటుకు సిద్ధమయ్యారు. సంకీర్ణ ప్రభుత్వంలోని కొందరు సభ్యులు కూడా అవిశ్వాసానికి అనుకూలంగా ఉన్నట్లు ప్రకటించారు. దీంతో ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు ఇమ్రాన్ ఖాన్ తంటాలు పడుతున్నారు.

ఏప్రిల్ 3 న తేలనున్న ఇమ్రాన్ భవితవ్యం
ఇమ్రాన్ను పదవి నుంచి దించాలంటే ప్రతిపక్షాలకు 172 మంది సభ్యుల మద్దతు అవసరం. పీటీఐకి చెందిన 24 మంది ఎంపీలు ఇమ్రాన్కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. అవిశ్వాస తీర్మానంలో వారు ఇమ్రాన్కు మద్దతుగా ఓటేస్తారన్న నమ్మకం లేదు. దీంతో..ఇప్పుడు ప్రధాని ఇమ్రాన్ తమ పార్టీ ఎంపీలకు జారీ చేసిన విప్ లో ఓటింగ్ లో పాల్గొనవద్దని స్పష్టం చేసారు. దీంతో..సభ్యులు దీనిని అనుసరిస్తారా.. లేక, ఇప్పుడున్న వ్యతిరేకుల సంఖ్య మరింత పెరుగుతుందా.. ఏప్రిల్ 3న ప్రధాని ఇమ్రాన్ రాజకీయ భవితవ్యం ఏం కానుందనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications