ప్లీజ్.. పాకిస్తాన్ పై వీసా ఆంక్షలు విధించండి: ట్రంప్ ను కోరిన ఇమ్రాన్ ఖాన్
పాకిస్తాన్ పైనా వీసా ఆంక్షలు విధించాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను పాకిస్తాన్ మాజీ క్రికెటర్, తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ కోరారు.
లాహోర్: పాకిస్తాన్ పైనా వీసా ఆంక్షలు విధించాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను పాకిస్తాన్ మాజీ క్రికెటర్, తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ కోరారు.
సాహివాల్ లో జరిగిన పార్టీ ర్యాలీలో పాల్గొన్న సందర్భంగా మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కనీసం అప్పుడైనా పాకిస్తానీలు తమ దేశాభివృద్ధిపై దృష్టి సారిస్తారని ఆశిస్తున్నట్లు ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు.
''పాకిస్తానీయులపైనా అమెరికా వీసా ఆంక్షలు విధించే అవకాశం ఉన్నట్లు వార్తలు వినవస్తున్నాయి. నేనైతే పాకిస్తానీయులకు కూడా వీసాలు నిరాకరించమని ట్రంప్ ను కోరుతున్నా. మా దేశాన్ని అభివృద్ధి చేసుకునేందుకు ఆ చర్య తప్పకుండా ఉపయోగపడుతుంది. అప్పుడు మేం కూడా ఇరాన్ తరహాలో స్పందిస్తాం. అమెరికా వాళ్లను పాకిస్తాన్ లోకి అడుగుపెట్టనివ్వం..'' అని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించారు.
తలనొప్పి వచ్చినా తమ ప్రధాని నవాజ్ షరీఫ్ విదేశాలకు వెళ్లి వైద్యం చేయించుకుంటున్నారని, వీసాపై నిషేధం విధిస్తే తప్ప ఆయన పాక్ అభివృద్ధిపై దృష్టి పెట్టేలా లేరని విమర్శించారు.
భారత్, పాక్ సంబంధాలపై కూడా ఇమ్రాన్ ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ''నవాజ్ షరీఫ్ మాదిరిగా పాకిస్తానీయులందరూ పిరికి పందలు కాదని భారత ప్రధాని నరేంద్ర మోడీకి నేను గుర్తుచేయాలనుకుంటున్నాను.. మాది శాంతికాముక దేశం.. అత్యధిక శాతం భారతీయులు కూడా పాకిస్తాన్ తో యుద్ధాన్ని కోరుకోవడం లేదు..'' అని ఆయన వ్యాఖ్యానించారు.