1965లో పాకిస్తాన్ కమాండోలు పారాచూట్లలో భారత వైమానిక స్థావరాలపై దిగినప్పుడు...
పాకిస్తాన్ బీ-57 యుద్ధ విమానాలు 1965 సెప్టెంబర్ 6, 7 రాత్రి భారత వైమానిక స్థావరాలపై బాంబులు వేయడానికి టేకాఫ్ కాగానే, వాటి వెనుకే మూడు సీ-130 హెర్కులెస్ విమానాలు కూడా భారత సరిహద్దులవైపు కదిలాయి.
ఆ విమానంలో ఒక్కో దానిలో 60 మంది చొప్పున ఎలీట్ స్పెషల్ సర్వీసెస్ గ్రూప్ కమాండోలు ఉన్నారు.
రాత్రి చీకట్లో భారత్లోని మూడు వైమానిక స్థావరాలు హల్వారా, ఆదంపూర్, పఠాన్కోట్ దగ్గర పారాచూట్లో దిగాలకున్న కమాండోలు, వాటిని ఆక్రమించాక, అక్కడున్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానాలను ధ్వంసం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
మేజర్ ఖాలిద్ భట్ నేతృత్వంలో 60 మంది పాకిస్తానీ కమాండోలు రాత్రి 2 గంటల సమయంలో పఠాన్కోట్ ఎయిర్ బేస్ దగ్గర దిగగానే, వారిని ఒక్కొక్కటిగా వరుస సమస్యలు చుట్టుముట్టాయి.
వైమానిక స్థావరం చుట్టుపక్కల కాలువలు, గుంటలు, బురద నిండిన పొలాలుండడంతో పారాచూట్లలో దిగిన వారు వేగంగా కదల్లేకపోయారు.
మూడు గంటలకే పొద్దెక్కడం మొదలైంది. అప్పటికే వారిని గమనించిన ఒక గ్రామస్థుడు ఆ సమాచారం పఠాన్కోట్ సబ్ ఏరియా హెడ్ క్వార్టర్స్కు అందించాడు.
ఒక కమాండో పాకిస్తాన్కు పారిపోయాడు
ఎయిర్ బేస్లో ఉన్న దాదాపు 200 మంది హడావిడిగా సమావేశమయ్యారు. తర్వాత రెండ్రోజుల్లోనే పాక్ పారాట్రూపర్స్లో చాలా మంది కమాండోలను అదుపులోకి తీసుకున్నారు.
రెండ్రోజుల తర్వాత వాళ్లను లీడ్ చేస్తున్న మేజర్ ఖాలిద్ భట్ కూడా దొరికాడు. హల్వారాలో రాత్రి అంత చీకట్లో కూడా పారాచూట్లో కిందికి దిగుతున్న పాక్ సైనికులు అందరికీ స్పష్టంగా కనిపించారు.
పాక్ పారాట్రూపర్స్ దిగిన విషయం తెలీగానే, వైమానిక స్థావరం భద్రతా అధికారి ఎయిర్మెన్, అధికారులు అందరికీ రైఫిళ్లు, పిస్టళ్లు అందించారు.
విమానాశ్రయం చుట్టుపక్కల గడ్డి మైదానాల్లో ఎక్కడ ఎలాంటి కలకలం కనిపించినా ఏమాత్రం సంకోచించకుండా కాల్పులు జరపాలని ఆదేశించారు.
పాకిస్తానీ కమాండోల్లో కొంతమంది నిజానికి వైమానిక స్థావరాల ప్రాంగణం లోపలే దిగారు. కానీ వారు ఏదైనా చేయడానికి ముందే.. యుద్ధ ఖైదీలుగా పట్టుబడ్డారు.
అయితే, జాన్ ఫ్రికర్ తన 'బాటిల్ ఫర్ పాకిస్తాన్' పుస్తకంలో ఆ కమాండోల్లో మేజర్ హుజూర్ హస్నైన్ అనే ఒక అధికారి భారత జీప్ దొంగిలించి ఒక సహచరుడితో తిరిగి పాకిస్తాన్ పారిపోవడంలో సఫలం అయ్యారని రాశారు.
హల్వారా బేస్లో గ్రౌండ్ డ్యూటీలో ఉన్న ఫైనాన్స్ డిపార్ట్మెంట్ హెడ్, స్క్వాడ్రన్ లీడర్ కృష్ణ్ సింగ్ స్వయంగా పాకిస్తాన్ కమాండోస్ లీడర్ను పట్టుకున్నారు. .
1965, 1971 రెండు యుద్ధాల సమయంలో కనపరిచిన సాహసాలకు వీర్ చక్ర్ అందుకున్న సైనికుడు కాని వ్యక్తి ఆయనొక్కరే.
- రాజీవ్ గాంధీ 1971 యుద్ధంలో దేశం వదిలి పారిపోయారా
- భారత్-పాకిస్తాన్ వార్ (1971): యుద్ధభూమిలో తన కాలును తానే నరికేసుకున్న భారత మేజర్
కుక్కల అరుపులు పట్టించాయి
ఆదంపూర్లో కూడా పాకిస్తాన్ సైనికులకు ఇలాంటి పరిస్థితే ఎదురయ్యింది. వారందరినీ ఎయిర్ బేస్కు చాలా దూరంలో దించారు. దాంతో వారంతా ఒక బృందంగా కలవలేకపోయారు. రాత్రి గట్టిగా అరుస్తున్న కుక్కలు వాళ్ల రహస్యాన్ని బయటపెట్టాయి.
అప్పటికే తెల్లవారడంతో కమాండోలు అందరూ మొక్కజొన్న చేలలో దాక్కున్నారు. దాంతో లుధియానా నుంచి వచ్చిన ఎన్సీసీ యువకులు వారి కోసం వెతికారు. కొంతమంది పారాట్రూపర్లను గ్రామస్థులు ఆగ్రహంతో కొట్టి చంపేశారు.
మొత్తం 180 మంది పారాట్రూపర్స్లో 138 మందిని సైన్యం బందీలుగా పట్టుకుంది. ఆర్మీ, పోలీసులు, గ్రామస్థులతో జరిగిన ఘర్షణలో 22 మంది పాక్ కమాండోలు చనిపోయారు. దాదాపు 20 మంది తిరిగి పాకిస్తాన్ పారిపోవడంలో సఫలం అయ్యారు.
ఇలా మళ్లీ పాక్ పారిపోగలిగిన కమాండోల్లో ఎక్కువ మంది పఠాన్కోట్ ఎయిర్ బేస్లో దిగినవారే ఉన్నారు. ఎందుకంటే అక్కడ నుంచి పాకిస్తాన్ సరిహద్దు కేవలం పది మైళ్ల దూరంలోనే ఉంటుంది.
- భారత్లో యుద్ధఖైదీ పాకిస్తాన్ ఎయిర్ఫోర్స్ చీఫ్ ఎలా అయ్యారు?
- కశ్మీర్పై భారత్-పాకిస్తాన్ల హెచ్చరిక ప్రకటనలను ఎలా అర్థం చేసుకోవచ్చు
పీవీ ఎస్ జగన్మోహన్, సమీర్ చోప్రా తమ 'ద ఇండియా పాకిస్తాన్ ఎయిర్ వార్' పుస్తకంలో ఆనాటి ఘటనలన్నీ రాశారు.
"60 మంది కమాండోల గ్రూప్ అంటే, అది ప్రజల దృష్టిని ఆకర్షించకుండా తమ పనిని పూర్తి చేయలేనంత పెద్ద సమూహం. మరో విధంగా చూస్తే సైన్యం చుట్టు ముడితే అది తమను తాము కాపాడుకోలేనంత చిన్న గ్రూప్ అని కూడా చెప్పవచ్చు" అన్నారు.
గువాహటీ, షిల్లాంగ్లో కూడా పాకిస్తాన్ కొంతమంది పారాట్రూపర్స్ను దించింది. కానీ వాళ్లు భారత్కు ఏదైనా నష్టం కలిగించక ముందే ఇండియన్ ఆర్మీ వారిని పట్టుకుంది.
- 1971 భారత్-పాకిస్తాన్ యుద్ధం: భారత్ను భయపెట్టేందుకు అమెరికా నేవీని పంపించింది. తర్వాత ఏం జరిగింది?
- ఏటా జనవరి 1న భారత్-పాకిస్తాన్లు అణ్వాయుధాల జాబితాను ఎందుకు ఇచ్చిపుచ్చుకుంటాయి?
పారాట్రూపర్స్ వస్తారనే వదంతులు
ఈ ఘటన రెండు దేశాల్లో చాలా విచిత్రమైన పరిస్థితులను సృష్టించాయి. ఒకసారి ఒక డ్యూటీ అధికారి కలలో పారాట్రూపర్స్ కనిపించారు.
దాంతో ఆయన "శత్రువులు, శత్రువులు ఫైర్, ఫైర్" అంటూ నిద్రలో కలవరించడం మొదలెట్టారు.
బ్లాక్ అవుట్ వల్ల చుట్టూ చీకటిగా ఉండడంతో, ఆ అరుపులు ఎక్కడనుంచి వస్తున్నాయో ఎవరికీ అర్థం కాలేదు. చాలా మందికి మెలకువ వచ్చింది. అక్కడ కలకలం మొదలైంది. అందరూ పిస్టళ్లు తీశారు. కాల్పులు మొదలయ్యే లోపే కమాండింగ్ ఆఫీసర్కు ఏం జరిగిందో అర్థమైంది.
ఎయిర్ మార్షల్ భూమ్ బిష్ణోయ్ ఆ రోజులను గుర్తు చేసుకున్నారు.
"హల్వారాలో పాక్ పారాట్రూపర్స్ దిగిన తర్వాత దిల్లీ దగ్గర హిండన్ ఎయిర్ బేస్ దగ్గర కూడా పాకిస్తానీ కమాండోలు దిగబోతున్నారనే వదంతులు వ్యాపించాయి. హిండన్ ఒక ఫామిలీ స్టేషన్ కావడంతో అక్కడి సీఓ మీరు కావాలంటే మీ భార్యా పిల్లలను సురక్షిత ప్రాంతాల్లో వదిలేసి రావచ్చని మాకు చెప్పారు. దాంతో, అందరూ ఏ వాహనం దొరికితే అందులో తమ కుటుంబ సభ్యులను ఎక్కించి దిల్లీ వైపు పంపించేశారు" అని చెప్పారు.
- 'తిలక్ ఇంకొన్నాళ్లు బతికుంటే భారత్-పాకిస్తాన్లు విడిపోయేవి కాదు’
- 1971లో భారత్పై పాకిస్తాన్ దాడి చేయబోతోందన్న విషయం RAW కి ముందే ఎలా తెలిసింది?
పాక్ సైనికుల పరస్పర కాల్పులు
అన్నిటికంటే ఆసక్తికరమైన ఘటన పాకిస్తాన్లో జరిగింది. భారత పారాట్రూపర్స్ సర్గోధా ఎయిర్ బేస్ మీద దిగబోతున్నట్టు అక్కడ కూడా వార్తలొచ్చాయి.
పాకిస్తాన్ ఎయిర్ హెడ్ క్వార్టర్, కమాండోస్తో నిండిన ఒక సీ-130 విమానాన్ని సర్గోధాకు పంపించింది.
ఆ విమానం చీకట్లో సర్గోధా ఎయిర్ బేస్లో లాండ్ అయ్యింది. అందులోంచి కమాండోలు దిగుతున్నారు. అదే సమయంలో అక్కడ అతి జాగ్రత్తకు పోయిన ఒక సెంట్రీ వాళ్లను భారత పారాట్రూపర్స్ అనుకుని తమ సైనికులను అలర్ట్ చేశాడు. దాంతో రెండు వైపులా కాల్పులు మొదలయ్యాయి. సెంట్రీ పొరపాటు వల్ల అక్కడ జరిగిన కాల్పుల్లో ఎంత మంది చనిపోయారు అనే వివరాలు తెలీలేదు. (ఎయిర్ కమాండర్ మన్సూర్ షా, ద గోల్డ్ బర్డ్: పాకిస్తాన్ అండ్ ఇట్స్ ఎయిర్ ఫోర్స్)
అలాగే పఠాన్కోట్లో పాక్ పారాట్రూపర్స్ దాడి చేయబోతున్నారనే సమాచారం రాగానే వారిని ఎదుర్కోడానికి బేస్లో ఉన్న వారందరికీ 9 ఎంఎం కార్బన్ తుపాకులు ఇచ్చారు.
అదే సమయంలో ఫ్లైట్ లెఫ్టినెంట్ పఠానియాకు కూడా ఒక కార్బన్ ఇచ్చారు. కానీ, ఆయనకు దానితో ఎలా కాల్పులు జరపాలో తెలీదు. దాంతో ఫ్లైట్ లెఫ్టినెంట్ తుషార సేన్ ఆయనకు కార్బైన్తో ఎలా ఫైర్ చేయాలో నేర్పించారు.
కార్బన్ ఫైర్ చేయడం నేర్చుకున్న సమయంలో ట్రిగ్గర్ మీద ఆయన వేళ్లు తడబడ్డాయి. దాంతో ఆ కార్బైన్లో ఉన్న 9 ఎంఎం బుల్లెట్లు మొత్తం దూసుకెళ్లాయి. అవి అక్కడే విశ్రాంతి తీసుకుంటున్న పైలెట్ల తలలకు కొన్ని అంగుళాల దూరంలోంచి వెళ్లాయి.
ఆ తర్వాత అక్కడ ఎలాంటి వాతావరణం ఏర్పడి ఉంటుందో మనం ఊహించుకోవచ్చు.
ఇవి కూడా చదవండి:
- ''ప్రజలను గౌరవించండి, మనం వారి సేవకులం'' -ఫైటర్లతో తాలిబాన్
- 'తాలిబాన్ల రాకతో శాంతి వెల్లివిరుస్తుంది’ - పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది
- 'బుర్ఖా వేసుకుని, మారువేషంలో 11 చెక్పాయింట్లను దాటి వెళ్లా. కానీ..’
- ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అమెరికా.. తాలిబాన్ను ఎందుకు ఓడించలేకపోయింది?
- తాలిబాన్లు అధికారంలోకి రావడం వల్ల ఎవరికి లాభం? ఎవరికి నష్టం
- 'పాకిస్తాన్ మాట వినకపోతే.. ప్రపంచానికి పెద్ద సమస్య తప్పదు’ - పాక్ మంత్రి ఫవాద్
- అఫ్గానిస్తాన్: ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పాక్ సరిహద్దుల దగ్గర పడిగాపులు కాస్తున్నారు
- తాజా నర మాంసాన్ని మేలైన ఔషధంగా ప్రాచీన వైద్య నిపుణులు ఎందుకు భావించేవారు?
- 'భారత అధికారుల్ని తీసుకొస్తుంటే తాలిబాన్లు చుట్టుముట్టిన వేళ..' : తెలుగు కమాండో రాజశేఖర్ స్వానుభవం
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి)