భారత్వి అరుపులే, అంత సీన్ లేదు: చైనా తీవ్ర వ్యాఖ్యలు
బీజింగ్: చైనా ఉత్పత్తులను బహిష్కరించాలని భారత దేశంలో సామాజిక అనుసంధాన వేదికలో నడుస్తున్న ప్రచారం పైన చైనా మీడియా స్పందించింది. చైనా ఉత్పత్తులతో భారత్ ఉత్పత్తులు పోటీ పడలేవని పేర్కొంది. భారత్వి అరుపులేనని, రెండు దేశాల మధ్య పెరుగుతున్న వాణిజ్యాన్ని పెరగకుండా ఏం చేయలేదని రాసింది.
చైనాలోని గ్లోబల్ టైమ్స్ పత్రిక పై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. చైనా వస్తువులకు భారత్ గట్టి పోటీ ఇవ్వలేద రాసింది. ఇటీవల భారత్-పాకిస్థాన్ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో చైనా పాకిస్థాన్కే మద్దతిస్తూ భారత్-చైనాల మధ్య కూడా ఉద్రిక్తత కనిపిస్తోంది.
పాక్కు చెందిన ప్రముఖ ఉగ్రవాది మసూద్ అజహర్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని భారత్ ఐక్య రాజ్య సమితిలో ప్రయత్నిస్తుండగా చైనా అడ్డుకుంది. ఇటీవల పాక్ను ఉగ్రవాద దేశమని భారత ప్రధాని నరేంద్ర మోడీ అభివర్ణించగా, చైనా వ్యతిరేకించింది.
తాజా పరిస్థితుల దృష్ట్యా చైనా వస్తువులు భారత్లో ఉపయోగించవద్దని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా దీపావళి సందర్భంగా చైనా నుంచి అధికంగా టపాసులు, అలంకరణ సామాగ్రి దిగుమతి చేసుకుంటుంటారు.
అలాగే ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం అసాధ్యమని చైనా మీడియా పేర్కొంది. ఇటీవల భారత మీడియాలో, సోషల్ మీడియాలో చైనా ఉత్పత్తులు బహిష్కరించాలని ప్రచారం జరుగుతోందని, కానీ చైనా వాణిజ్య విషయంలో భారత్ ఏమీ చేయలేదని పేర్కొంది.
భారత్ ఇంకా రోడ్లు, హైవేలు నిర్మించుకోవాల్సి ఉందని, విద్యుత్, నీటి సరఫరా సరిగా ఉండవని, ప్రతి ప్రభుత్వ విభాగంలో కింద నుంచి పై స్థాయి వరకు అంతా అవినీతి ఉందని సదరు పత్రిక తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అలాగే అమెరికాతో భారత్ సన్నిహితంగా ఉండడంపై విమర్శలు చేసింది. అమెరికా ఎవ్వరికీ మిత్రుడు కాదని, చైనా కోసం భారత్తో సన్నిహితంగా ఉంటోందని, చైనా అభివృద్ధిపై అమెరికా అసూయపడుతోందని రాసింది.