ట్రంప్ కు భారత్ ఘాటు కౌంటర్.. ! అమెరికాతో చర్చించాం కానీ.. !
పహల్గాంలో ఉగ్రదాడి తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ఉధృతంగా సాగుతున్న వేళ తాను సుంకాల బూచి చూపి పాకిస్తాన్ తో కాల్పుల విరమణకు ఒప్పించానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే పదే వాదిస్తున్నారు. ఇదే విషయాన్ని తాజాగా అమెరికా కోర్టుకూ చెప్పి తన సుంకాల నిర్ణయాన్ని సమర్ధించుకునేందుకు ప్రయత్నించారు. అయితే అమెరికా కోర్టు మాత్రం ఈ వాదనను తోసిపుచ్చింది. సుంకాలపై ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకునే అధికారం కాంగ్రెస్ కు తప్ప అమెరికా అధ్యక్షుడికి లేదని తేల్చేసింది.
ఈ నేపథ్యంలో భారత్ స్పందించింది. అమెరికా కోర్టులో తన సుంకాల నిర్ణయాన్ని సమర్ధించుకునే క్రమంలో ట్రంప్ చేసిన వాదనను కేంద్రం తోసిపుచ్చింది. సుంకాలపై తాను తీసుకున్న నిర్ణయాలను తిరగతోడితే భారత్-పాక్ మధ్య తాను కుదిర్చిన కాల్పుల విరమణ రాజీ అర్ధం లేకుండా పోతుందంటూ ట్రంప్ సర్కార్ చేసిన వాదనను భారత్ ఖండించింది. అసలు పాకిస్తాన్ తో కాల్పుల విరమణకూ, అమెరికా సుంకాలతో సంబంధమే లేదంటూ తేల్చేసింది.

మే 7న ఆపరేషన్ సిందూర్ ప్రారంభమైనప్పటి నుండి మే 10న ఆగిపోయే వరకు భారత్, అమెరికా మధ్య చర్చలు జరిగాయని, కానీ ఈ చర్చలలో సుంకాల అంశం ఎప్పుడూ ప్రస్తావనకు రాలేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వెల్లడించారు. దీంతో అమెరికాతో చర్చలు జరిపినా సుంకాలకు లొంగిపోయి కాల్పుల విరమణకు మాత్రం అంగీకరించలేదని ఆయన తేల్చిచెప్పేశారు. తద్వారా అమెరికా కోర్టులో ట్రంప్ సర్కార్ వాదనను తిరస్కరించారు.

ప్రపంచ సమస్యలను పరిష్కరించడానికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. కీలక వాణిజ్య భాగస్వాములతో సహా విదేశీ దేశాలను అధిక దిగుమతి సుంకాలతో బెదిరిస్తున్నారని అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ , విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ఇవాళ కోర్టుకు తెలిపారు. కాల్పుల విరమణ, అమెరికా ఎగుమతులపై సుంకాలను తగ్గించమని చైనాను బలవంతం చేయడం వీటిని ఉదాహరణలుగా పేర్కొన్నారు. అయితే ట్రంప్ నిర్ణయాలను నిలిపేస్తే వీటిపై ప్రభావం పడుతుందన్న వాదనను కోర్టు తోసిపుచ్చింది.












Click it and Unblock the Notifications