అప్ఘన్ కొత్త సారధి బరాదర్ పై భారత్ ఆశలు-దౌత్య అనుభవం-పాక్ చేతిలో అవమానం-సమీకరణాలివే
ఆప్ఘనిస్తాన్ లో కొత్త ప్రభుత్వం మరికొన్ని గంటల్లోనే కొలువుదీరబోతోంది. దీనికి సారధిగా తాలిబన్ల కమాండర్, ఇప్పటివరకూ వారికి అంతర్జాతీయంగా వివిధ దేశాలతో సత్సంబంధాలు పెంచేందుకు ప్రయత్నిస్తున్న కీలక నేత అబ్దుల్ ఘనీ బరాదర్ వ్యవహరించబోతున్నారు. ఇప్పటివరకూ ఆప్ఘనిస్తాన్ లో స్పష్టమైన వైఖరి వెల్లడించని భారత్... బరాదర్ విషయంలో మాత్రం భారీగానే ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకు బరాదర్ కు అంతర్జాతీయంగా ఉన్న సంబంధాలు, ఇతర అంశాలే కారణమవుతున్నాయి.
Recommended Video
ఆప్ఘన్ లో తాలిబన్ల సర్కార్ నేడే
ఆప్ఘనిస్తాన్ లో ప్రజా ప్రభుత్వం స్ధానంలో తాలిబన్ల కొత్త సర్కార్ ఇవాళ ఏర్పాటు కాబోతోంది. ప్రభుత్వ సారధిగా అంతర్జాతీయ వ్యవహారాల్లో అనుభవం కలిగిన తాలిబన్ నేత అబ్దుల్ ఘనీ బరాదర్ నేతృత్వం వహించబోతున్నారు. ఆయనతో పాటు పలువురు తాలిబన్ కీలక నేతలు, హక్కానీ నెట్ వర్క్ ప్రతినిధులు కూడా ప్రభుత్వంలో భాగస్వాములు కాబోతున్నట్లు తెలుస్తోంది. తాలిబన్లు దీనిపై స్పష్టమైన ప్రకటనేదీ చేయకపోయినా పాకిస్తాన్ కన్నుసన్నల్లో ఉండే ప్రభుత్వాన్నే తాలిబన్లు ఏర్పాటు చేయవచ్చని తెలుస్తోంది. దీంతో తాలిబన్ల సర్కార్ ఏర్పాటుపై అంతర్జాతీయంగా పలు దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. ఇదే కోవలో భారత్ కూడా ఆప్ఘన్ పరిణామాల్ని నిశితంగా గమనిస్తోంది.
ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్
తాలిబన్ల కమాండర్లలో ఒకడైన ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్ ఇప్పుడు కొత్త ప్రభుత్వ సారధిగా వ్యవహించబోతున్నారు. ఆయన ఆప్ఘనిస్తాన్ లోని పోపల్ జాయ్ తెగకు చెందిన దురానీ పష్తూన్ నేత. బరాదర్ ఆప్ఘన్ లోని ఉరుజ్గాన్ ప్రావిన్స్ లో 1968లో జన్మించారు. తాలిబన్ల వ్యవస్ధాపకుడు ముల్లా ఒమర్ కు అత్యంత సన్నిహితుల్లో బరాదర్ కూడా ఒకరు. గతంలో 1996-2001 మధ్య ఆప్ఘన్ ను పాలించిన తాలిబన్ల ప్రభుత్వంలో డిప్యూటీ రక్షణమంత్రిగా బరాదర్ వ్యవహించారు. అంతేకాదు ఆప్ఘనిస్తాన్ నుంచి అంతర్జాతీయ సంబంధాలు కలిగిన అత్యంత తక్కువ మంది తాలిబన్ నేతల్లో బరాదర్ కూడా ఒకరు. దీంతో సహజంగానే బరాదర్ ను ప్రస్తుతం వివిధ దేశాలు నిశితంగా గమనిస్తున్నాయి.
బరాదర్ పై భారత్ ఆశలు
అంతర్జాతీయ వ్యవహారాల్లో తాలిబన్లను నడిపిస్తున్న బరాదర్ పై సొంత వర్గంతో పాటు వివిధ దేశాల అధినేతలకూ మంచి సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా గల్ఫ్ దేశాలు, ముస్లిం దేశాలతో బరాదర్ కు సత్సంబంధాలు ఉన్నాయి. అదే సమయంలో అంతర్జాతీయ దౌత్య వేత్తగా పేరు తెచ్చుకున్న బరాదర్ భారత్ తోనూ అంతర్గతంగా సంబంధాలు కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా భారత రాయబారులు తాలిబన్లతో వివిధ దేశాల్లో జరుపుతున్న చర్చల్లో బరాదర్ పాత్ర ఉన్నట్లు సమాచారం. దీంతో భారత్ దృష్టికోణంలో బరాదర్ కీలక నేతగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన నేతృత్వంలోని తాలిబన్ ప్రభుత్వం కొలువుదీరబోతున్న నేపథ్యంలో బరాదర్ పై భారత్ భారీగానే ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది.
పాకిస్తాన్ చేతిలో అవమానాలు ఎదుర్కొన్న నేత
2001లో అమెరికాలోని ట్విన్ టవర్స్ పై దాడుల తర్వాత ఆ దేశం ఆప్ఘనిస్తాన్ పై యుద్ధం ప్రకటించింది. అప్పట్లో అక్కడ ఉన్న తాలిబన్ సర్కార్ ను కూలదోసి హమీద్ కర్జాయ్ నేతృత్వంలో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఈ చర్యల తర్వాత బరాదర్ పాకిస్తాన్ పారిపోయాడు. కానీ అక్కడ కొన్నాళ్లు ఉన్నాక ఆప్ఘన్ లో కర్జాయ్ ప్రభుత్వానికీ, యూఎస్ కు సహకరిస్తున్నాడనే అనుమానంతో బరాదర్ ను అరెస్టు చేసి పాకిస్తాన్ ప్రభుత్వం 8 ఏళ్లు జైల్లో ఉంచింది. దీంతో తాను సేఫ్ గా భావించి వెళ్లిన పాకిస్తాన్ తనను నిర్బంధించి జైల్లో పెట్టేసరికి బరాదర్ అవమానంతో రగిలిపోయాడు. తిరిగి 2018లో అమెరికాలోని ట్రంప్ సర్కార్ పాకిస్తాన్ పై ఒత్తిడి తెచ్చి బరాదర్ ను తిరిగి ఆఫ్గన్ పంపి శాంతి చర్చలు చేసేలా ఒప్పించింది.
బరాదర్ ను భారత్ ను దగ్గర చేస్తున్న సమీకరణాలు
ప్రస్తుతం ఆప్గనిస్తాన్ లో మారిన పరిస్దితుల నేపథ్యంతో పాటు పాకిస్తాన్ లో గతంలో అవమానాలు ఎదుర్కొన్న అనుభవం ఇప్పుడు బరాదర్ ను భారత్ కు దగ్గర చేస్తున్నాయి. ముఖ్యంగా పాకిస్తాన్ కన్నుసన్నల్లో తాలిబన్ల పాలన ఉండబోతోందని అందరూ భావిస్తున్నా గతంలో ఆప్ఘన్ మాజీ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ సోదరుడు చెప్పినట్లు తాలిబన్లను నియంత్రించే శక్తి పాకిస్తాన్ కు లేదనే అంశం వెనుక బరాదర్ సమీకరణాలే ఉన్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ చెప్పుచేతల్లో తాలిబన్ ప్రభుత్వం ఉండేందుకు బరాదర్ అనాసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అంతర్జాతీయ మద్దతు కోసం తాలిబన్లు చేస్తున్న ప్రయత్నాలకు పాకిస్తాన్ అడ్డంకిగా మారకూడదని ఆయన భావిస్తున్నారు. దీంతో భారత్ తో సంబంధాల విషయంలోనూ బరాదర్ కీలక నేతగా మారబోతున్నట్లు అర్ధమవుతోంది.