కరోనా వ్యాక్సిన్ తయారీలో ఇండియానే కీలకం, 2021లో భారీగా వ్యాక్సిన్ ఉత్పత్తి: బిల్గేట్స్
వాషింగ్టన్/న్యూఢిల్లీ: కరోనావైరస్ వ్యాక్సిన్ తయారీలో భారతదేశం కీలక పాత్ర పోషిస్తుందని మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ పునరుద్ఘాటించారు. వ్యాక్సిన్ తయారీలో అందరికంటే ముందు వరుసలో ఉన్న భారత్వైపే ప్రపంచం చూస్తోందని పేర్కొన్నారు. వ్యాక్సిన్ అభివృద్ధి, తయారీలో భారతదేశ పాత్ర అనే అంశంపై ఆయన మాట్లాడారు.
Recommended Video

ప్రపంచానికి భారత సహకారం కీలకం..
ఈ విపత్కర సమయంలో ప్రపంచానికి భారతదేశ సహకారం ఎంతో అవసరమని బిల్ గేట్స్ వ్యాఖ్యానించారు. సమర్థవంతమైన, సురక్షితమైన వ్యాక్సిన్ వచ్చిన వెంటనే.. భారత్ నుంచి భారీ స్థాయిలో ఆ వ్యాక్సిన్లు ఉత్పత్తి అయ్యే అవకాశాలున్నాయని ఆయన తెలిపారు. ఇండియాలో వ్యాక్సిన్ వచ్చే ఏడాదిలోనే సాద్యమయ్యే అవకాశాలున్నాయని అంచనా వేశారు.

2021లో భారత్ నుంచే అత్యధిక కరోనా వ్యాక్సిన్లు..
2021 తొలి త్రైమాసికం నాటికి చాలా వ్యాక్సిన్లు తుది దశ ప్రయోగాలకు చేరుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు బిల్ గేట్స్. వ్యాక్సిన్ తయారీలో భారత్ అతిపెద్ద పాత్ర పోషించనుందన్నారు. అయితే, వ్యాక్సిన్లను అభివృద్ధి చెందుతోన్న దేశాలకు తరలించడమే కీలకమని అన్నారు.

ఇతర దేశాల వ్యాక్సిన్లూ ఇండియాలోనే..
ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే 38 వ్యాక్సిన్లు మానవ ప్రయోగ దశలో ఉండగా, మరో 93 వ్యాక్సిన్లు ప్రీ క్లినికల్ ట్రయల్స్ దశలో ఉన్నట్లు బిల్ గేట్స్ వెల్లడించారు. ప్రపంచంలోని ఇతర దేశాలకు చెందిన వ్యాక్సిన్లు కూడా భారతదేశంలోనే ఉత్పత్తి అవుతాయని అన్నారు. ఆస్ట్రాజెనికా, నోవావాక్స్, సపోని, జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్లు భారత్లోనే తయారు చేసేందుకు ప్రయత్నాలు ఇప్పటికే ప్రారంభమైనట్లు తెలిపారు.

భారత్ లాంటి దేశంలో కరోనా కట్టడి కష్టమే..
ప్రపంచంలో కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి చేసే పలు కంపెనీలకు మిలిందా గేట్స్ ఫౌండేషన్ ద్వారా బిల్ గేట్స్ భారీ ఎత్తున విరాళాలు ఇస్తున్న విషయం తెలిసిందే. కాగా, ఇక వంద కోట్లకుపైగా జనాభా ఉన్న భారతదేశంలో కరోనా కట్టడి కొంతమేర కష్టమేనని బిల్ గేట్స్ వ్యాఖ్యానించారు. వచ్చే రెండు మూడు నెలలు ఇండియాకు ఎంతో కీలకమని ఆయన అన్నారు. హెర్డ్ ఇమ్యూనిటీ కరోనాను అంతం చేయలేదని బిల్ గేట్స్ అభిప్రాయపడ్డారు. సురక్షితమైన, సమర్థవంతమైన వ్యాక్సిన్ వస్తే గానీ కరోనాను కట్డడి చేయగలమని అన్నారు.












Click it and Unblock the Notifications