కేటుగాళ్లున్నారు జాగ్రత్త: H-1B వీసాల్లో మోసానికి పాల్పడిన ఇండో అమెరికన్ అరెస్టు
వాషింగ్టన్ : 11 బూటకపు హెచ్1 బీ వీసా దరఖాస్తులు సమర్పించినందుకు గాను భారతత సంతతికి చెందిన అమెరికా పౌరుడిని అరెస్టు చేసినట్లు అమెరికా అటార్నీ క్రెయిగ్ కార్పెనిటో చెప్పారు. న్యూజెర్సీలో నివాసముంటున్న 43 ఏళ్ల నీరజ్ శర్మ ఫేక్ హెచ్1బీ వీసా దరఖాస్తులు సబ్మిట్ చేసి మోసానికి పాల్పడినందున ఆయన్ను అరెస్టు చేసినట్లు అటార్నీ తెలిపారు. త్వరలోనే నీరజ్ను నెవార్క్ ఫెడరల్ కోర్టు ముందు హాజరు పరుస్తామని వెల్లడించారు. బూటకపు వీసాలు సమర్పించడమే కాకుండా సహజ మోసానికి కూడా పాల్పడినందున నీరజ్ను అరెస్టు చేసినట్లు వెల్లడించారు.
వీసా మోసంతో పాటు సహజ మోసాలకు పాల్పడినవారికి గరిష్టంగా 10 ఏళ్లు జైలు శిక్షతో పాటు 2,50,000 అమెరికా డాలర్లు జరిమానా విధించడం జరుగుతుంది. కేసులో నమోదైన అభియోగాల ప్రకారం అమెరికాలో ఐటీ ఉద్యోగం చేయాలన్న తపన ఉన్న విదేశీయులుకు ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి వారిని ఇక్కడి తీసుకొస్తుంటాడని ఉంది.
న్యూజెర్సీలో ఉన్న ఐటీ స్టాఫింగ్ మరియు కన్సల్టింగ్ కంపెనీ మాగ్నావిజన్ ఎల్ఎల్సీకి సీఈఓ మరియు ఓనర్గా వ్యవహరిస్తున్నాడు నీరజ్. విదేశీయులకు ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించడంలో భాగంగా వారికి ఫుల్టైం పొజిషన్ ఉందని వారు ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారని డాక్యుమెంట్లలో పొందుపరిచేవాడు. వీసా పొందాలంటే వారికి ఉద్యోగం ఉన్నట్లు చూపించాలన్న కండీషన్ ఉండటంతో నీరజ్ ఇలా ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించినట్లు అటార్నీ ఆరోపించారు.
విదేశీయులను అమెరికా కంపెనీల్లో పనిచేయించుకునేందుకు వారు అక్కడ ఉండేందుకు హెచ్1బీ వీసా అవసరం అవుతుంది. అయితే శర్మ బూటకపు డాక్యుమెంట్లను మాత్రమే తయారు చేశాడని ఆ తర్వాత వచ్చిన విదేశీయులకు ఎవరికీ ఉద్యోగాలు చూపించలేకపోయాడని అటర్నీ ఆరోపించారు. అంతేకాదు సంతకాలు కూడా ఫోర్జరీ చేసినట్లు వెల్లడైందని ప్రాసిక్యూటర్ తెలిపారు. తను ఒక భారతీయ పౌరుడిగానే ఉంటూ ఈ నేరాలకు పాల్పడ్డాడని అంతేకాకుండా తాను న్యాయపరంగా అమెరికా పౌరసత్వం కలిగి ఉన్నట్లు చెప్పుకున్నాడని ప్రాసిక్యూటర్ స్పష్టం చేశారు.