కొత్త ఇల్లు కలసి రాలేదని కుటుంబాన్ని చంపుకున్నాడు.. అమెరికాలో తెలుగు వారి మృతి వెనుక సిల్లీ రీజన్స్!
అనుమానం పెనుభూతం అంటారు. ఏ విషయంలోనైనా ఒకసారి అనుమానం వచ్చిందంటే ఇక దాన్ని వదిలించుకోవడం కష్టమే. అలాంటి అనుమానమే అమెరికాలో స్థిరపడ్డ భారతీయ కుటుంబానికి పెనుశాపంలా మారింది. కొత్తగా కట్టుకున్న ఇల్లు కలిసి రావడం లేదన్న కారణంతో ఇంటి పెద్ద కుటుంబం మొత్తాన్ని చంపుకున్నాడు. అమెరికాలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు తెలుగువారి విషాదాంతానికి ఇదే కారణమన్న వాదనలు వినిపిస్తున్నాయి.
బలి తీసుకున్న నిర్లక్ష్యం.. బస్సులో వదిలేయడంతో ఆరేళ్ల చిన్నారి మృతి..
అమెరికాలో స్థిరపడ్డ చంద్రశేఖర్ కుటుంబం
అమెరికా అయోవా స్టేట్లోని వెస్ట్ డెస్మెయిన్స్లో ఉంటున్న చంద్రశేఖర్ సాఫ్ట్వేర్ ఉద్యోగి. ఆయన స్వస్తలం గుంటూరు. ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం కొత్తకోటకు చెందిన లావణ్యతో 2003లో ఆయనకు పెళ్లైంది. ఆ తర్వాత రెండేళ్లకు వారు అమెరికావెళ్లి అక్కడే స్థిరపడ్డారు. ఇంజనీరింగ్లో పీహెచ్డీ చేసిన లావణ్య కొంతకాలం నాసాలో పనిచేసింది. వీరికి 15,10 సంవత్సరాల వయసున్న ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఎలాంటి చీకూచింతా లేకుండా వీరి సంసారం సాగింది.
గృహప్రవేశం జరిగిన రోజే
అమెరికాలో స్థిరపడ్డ చంద్రశేఖర్ దంపతులు ఈ ఏడాది మార్చిలో వెస్ట్డెస్మెయిన్స్లో ఓ ఇల్లు కొన్నారు. అమెరికా కాలమానం ప్రకారం శనివారం గృహ ప్రవేశం జరిగింది. అనంతరం ఇండియా నుంచి వచ్చిన బంధువులతో కలిసి దగ్గరలోని రెస్టారెంట్కు వెళ్లి డిన్నర్ చేశారు. ఇంటికి తిరిగొచ్చి ఎవరి రూంలో వాళ్లు రెస్ట్ తీసుకున్నారు. రెస్టారెంట్ నుంచి వచ్చిన కొద్ది సేపటికి చంద్రశేఖర్ బాల్కనీలో ఉన్న భార్య లావణ్యను కాల్చిచంపాడు. ఆ శబ్దం విని లావణ్య తండ్రి సీతారామిరెడ్డి తన రూం నుంచి బయటకు వచ్చాడు. ఎదురుగా కనిపించిన అల్లున్ని ఏం జరిగిందని ప్రశ్నించగా.. ఏం లేదు వెళ్లి పడుకోండని చెప్పాడు.
కొడుకులను చంపి తాను కూల్చుకుని
భార్యను చంపిన తర్వాత చంద్రశేఖర్ పిల్లలు పడుకుని ఉన్న గదిలోకి వెళ్లాడు. కాసేపటిలో ఆ రూం నుంచి మళ్లీ గన్ పేలిన శబ్దం రావడంతో సీతారామిరెడ్డి ఆ రూంలోకి వెళ్లి చూడగా.. చంద్రశేఖర్, ఆయన ఇద్దరు కొడుకులు రక్తపు మడుగులు కనిపించారు. బాల్కనీలో కూతురు లావణ్య మృతదేహం చూసి భయంతో కేకలు వేస్తూ బయటకు పరుగులు తీశాడు. విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
మానసిక ఒత్తిడే కారణం?
కొంతకాలంగా తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్న చంద్రశేఖర్ భార్యాపిల్లల్ని చంపి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. పెద్ద కొడుకుకు ఆరోగ్యం బాగోలేకపోవడంతో కొన్నాళ్లుగా అనేక ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. అయితే వ్యాధి నయం కాకపోవడంతో ఆయన ఆందోళన మరింత పెరిగింది. వెస్ట్ డెస్మెయిన్స్లో ఇల్లు కొన్నప్పటి నుంచి పరిస్థితులు అనుకూలించడం లేదన్న అనుమానం చంద్రశేఖర్ను వెంటాడినట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే అతను దారుణానికి ఒడిగట్టి ఉంటారని బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు.
తానా ప్రతినిధుల సాయం
ఇల్లు కలిసిరాలేదన్న అనుమానంతో చంద్రశేఖర్ కుటుంబం ప్రాణాలు తీసుకున్న ఘటన స్థానికులను కలిచివేసింది. మృతుల ఇంటికి చేరుకున్న తానా ప్రతినిధులు చట్టపరమైన కార్యక్రమాలు పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యారు. నలుగురి అంత్యక్రియలు అమెరికాలోనే జరిపించనున్నట్లు సమాచారం.