అమెరికాలో కాల్పులు: ఇండియన్ అమెరికన్ మృతి, మరొకరికి తీవ్ర గాయాలు
వాషింగ్టన్: అమెరికాలో కాల్పులు మరోసారి కలకలం సృష్టించాయి. జార్జియాలోని రెండు స్టోర్లలో ఓ దుండుగు జరిపిన కాల్పుల్లో ఓ భారతీయ అమెరికన్ మృతి చెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జార్జియాలోని బర్నెట్ ఫెర్నీ రోడ్లో గల హైటెక్ క్విక్ స్టాప్ స్టోర్లోకి ఓ వ్యక్తి తుపాకీతో వచ్చాడు. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే స్టోర్లోని కౌంటర్ వద్ద నిల్చున్న పరంజిత్ సింగ్ అనే వ్యక్తిపై కాల్పులు జరిపాడు. దీంతో అతడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.
ఆ తర్వాత అక్కడ్నుంచి పక్కనే ఉన్న మరో స్టోర్లోకి వెళ్లి కౌంటర్ వద్ద డబ్బును దొంగలించాడు దుండగుడు. ఈ సమయంలో అక్కడేవున్న స్టోర్లో పనిచేస్తున్న పార్థీ పటేల్పై కాల్పులు జరిపాడు. దీంతో పార్థీ తీవ్రంగా గాయపడ్డాడు.
అనంతరం పారిపోతున్న దుండగుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలోనూ పలు నేరాలకు పాల్పడిన లమర్ రషద్ నికోల్సన్గా దుండగుడ్ని గుర్తించారు. ఘటనపై అతడ్ని విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.