కరోనా వైరస్ ఎఫెక్ట్.. రిపబ్లిక్ డే వేడుకలు రద్దు.. చైనాలోని ఇండియన్ ఎంబసీ నిర్ణయం
ప్రపంచాన్ని వణికిస్తోన్న 'కరోనా వైరస్' రోజురోజుకూ విస్తరిస్తోంది... దీని బారిన పడి చైనాలో 25 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 850 మందికి వైరస్ సోకినట్లు గుర్తించారు. దీంతో అప్రమత్తమైన చైనా ప్రభుత్వం.. ప్రజలు బయటతిరగొద్దని, షాపింగ్ మాల్స్, సినిమా హాళ్లు, సభలు, సమావేశాలకు వెళ్లొద్దని హెచ్చరించింది. దీంతో చైనాలోని ఇండియన్ ఎంబసీ ఆదివారం జరగాల్సిన రిపబ్లిక్ డే వేడుకల్ని రద్దుచేసింది. శుక్రవారం నాటికి కరోనా మహమ్మారి ఇండియాలోకి కూడా ప్రవేశించడంతో ఇక్కడ కూడా ఆందోళనలు రెట్టింపయ్యాయి.

ఘనంగా చేద్దామనుకుంటే..
ప్రస్తుతం చైనాలో నెలకొన్న ఎమర్జెన్సీ పరిస్తితుల దృష్ట్యా ఈ ఏడాది రిపబ్లిక్ డే వేడకుల్ని రద్దు చేస్తున్నట్లు బీజింగ్ లోని భారత దౌత్య కార్యాలయం శుక్రవారం వెల్లడించింది. కరోనా వైరస్ ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి సులువుగా వ్యాపించే అవకాశం ఉండటంతో చైనా అధికారులు పబ్లిక్ మీటింగ్స్కు అనుమతి ఇవ్వడం లేదు. చైనా సార్వభౌమత్వాన్ని గుర్తించిన నాన్ కమ్యూనిస్టు దేశాల్లో మొదటిది ఇండియానే కావడం, బీజింగ్ లో భారత రాయబార కార్యాలయం ఏర్పాటై 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈఏడాది(2020) రిపబ్లిక్ డే వేడుకల్ని ఘనంగా నిర్వహించాలని మనవాళ్లు ప్లాన్ చేశారు. కానీ కరోనా వైరస్ వల్ల కార్యక్రమాలు రద్దయ్యాయి.

ఇండియాలోకి ప్రవేశించిన వైరస్..
గణతంత్ర వేడుకలకు సిద్ధమవుతోన్న వేళ.. మహమ్మారి ‘నావల్ కరోనా వైరస్‘ ఇండియాలోకి ప్రవేశించింది. తొలి పంజా మన ఆర్థిక రాజధాని ముంబైపై విసిరింది. చైనా నుంచి ముంబై వచ్చిన ఇద్దరు వ్యక్తులకు వైరస్ సోకినట్లు గుర్తించామని బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్(బీఎంసీ) శుక్రవారం ప్రకటించింది. ఆ ఇద్దరరి ప్రస్తుతం.. దక్షిణ ముంబై, చించ్పోకలిలోని కస్తూర్బా ఆస్పత్రిలో ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు బీఎంసీ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పద్మజా కేస్కర్ చెప్పారు.

కరోనా వైరస్ అంటే?
చైనాలో తాచు పాముల వల్ల వ్యాపించినట్లుగా భావిస్తోన్న ఈ ప్రాణాంత వైరస్ సోకితే.. జలుబు, దగ్గు, జ్వరం, తలనొప్పి, ఛాతిలో నొప్పి, వాంతులు తీవ్రంగా ఉంటాయి. ఈ లక్షణాలు తీవ్రమైన న్యుమోనియోకు దారి తీసి ఊపిరాడక మనిషి మరణించే ప్రమాదమూ ఉంటుంది. ఈ లక్షణాలకు చికిత్స చేయడం తప్ప ప్రస్తుతం ఎలాంటి వ్యాక్సిన్ అందుబాటులో లేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సూచనల మేరకు అన్ని దేశాల ఎయిర్ పోర్టుల్లో చైనా నుంచి వచ్చే ప్రయాణికుల్ని థర్మల్ స్కానర్లతో పరీక్షలు చేసిన తర్వాతే వదులుతున్నారు. అలా ముంబైలో రెండు కేసుల్ని గుర్తించారు.












Click it and Unblock the Notifications