బదులు తీర్చుకుంటాం..ఆ హక్కు మాకుంది: ఎన్నికల లబ్ది కోసమే భారత ప్రభుత్వం దాడులు
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ పరిధిలో ఉన్న ఉగ్రవాద శిక్షణ శిబిరాలపై మనదేశం చేపట్టిన వైమానిక దాడులపై ఆ దేశం స్పందించింది. భారత వైమానిక దాడులకు ప్రతీకారం తీర్చుకోవడానికి ఎదురు చూస్తున్నామని పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషి వెల్లడించారు. భారత్.. నియమ, నిబంధనలను ఉల్లంఘించిందని, నియంత్రణ రేఖను దాటి, తమ దేశ భూభాగంపైకి చొచ్చుకు వచ్చిందని ఆరోపించారు.
భారత వైమానిక దాడుల అనంతరం ఆయన రాజధాని ఇస్లామాబాద్ లో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పలువురు ఉన్నతాధికారులు, మాజీ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశ ప్రజలను తాను తప్పుదారి పట్టించడానికి సిద్ధంగా లేనని చెప్పారు. తమ దేశంపై యుద్ధ మేఘాలు అలుముకున్నాయని, ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. స్వదేశాన్ని సంరక్షించడానికి, ప్రజలను పరిరక్షించడానికి అన్ని వేళల్లో అప్రమత్తంగా ఉండాలని తాను సైన్యాన్ని కోరుతున్నట్లు చెప్పారు.
తమది బాధ్యత గల దేశమని, బాధ్యత గల ప్రజలు తమ దేశంలో నివసిస్తున్నారని ఖురేషీ చెప్పారు. దౌత్య పరంగా అన్ని సమస్యలను పరిష్కరించుకోవడానికి అవకాశం ఉన్నప్పటికీ.. భారత్ అకారణంగా దాడులకు దిగిందని అన్నారు. భారత్ లో త్వరలో ఎన్నికలు రానున్నాయని, దాని నుంచి లబ్ది పొందడానికే ఆ దేశ ప్రభుత్వం వైమానిక దాడులు చేసిందని విమర్శించారు. స్వదేశంలో భారత ప్రభుత్వం రాజకీయపరమైన దాడులను ఎదుర్కొంటోందని, దాని నుంచి దృష్టి మరల్చడానికి తమ భూభాగంలోకి చొచ్చుకు వచ్చిందని ఖురేషీ చెప్పారు తమను తాము ఎలా రక్షించుకోవాలో పాకిస్తాన్ ప్రజలకు తెలుసని ఖురేషి వ్యాఖ్యానించారు.