ఇండియన్ టెక్కీ: నలుగురిని చంపి..మృతదేహాలతో 350 కిలోమీటర్లు..
కాలిఫోర్నియా: భారత సంతతికి చెందిన ఓ సాఫ్ట్ వేర్ నిపుణుడు సామూహిక హత్యలకు పాల్పడ్డాడు. అపార్ట్ మెంట్ లో తనతో పాటు నివసించే నలుగురిని కిరాతకంగా హతమార్చాడు. వారిలో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అనంతరం ఒక మృతదేహాన్ని తీసుకుని 350 కిలోమీటర్ల దూరం ప్రయాణించాడు. మృతదేహంతోొ సహా పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. మిగిలిన మూడు మృతదేహాలు తాను నివసించే అపార్ట్ మెంట్ లో ఉన్నాయని తాపీగా సమాచారం ఇవ్వడంతో పోలీసులు అవాక్కయ్యారు. అమెరికాలోని నార్త్ కాలిఫోర్నియాలో ఈ ఘటన చోటు చేసుకుంది.
హంతకుడి పేరు శంకర్ నాగప్ప హంగద్. కన్నడిగుడు. కర్ణాటకకు చెందిన శంకర్ నాగప్ప చాలాకాలం కిందటే అమెరికాలో స్థిరపడ్డాడు. నార్త్ కాలిఫోర్నియా మౌంట్ సాషా ప్రాంతంలోని ఓ అపార్ట్ మెంట్ లో నివసిస్తున్నాడు. శాక్రమెంటోలోని ఐటీ సంస్థలో డేటా స్పెషలిస్ట్ గా పని చేస్తున్నాడు. తన అపార్ట్ మెంట్ లో నివసించే నలుగురిని దారుణంగా హత్య చేశాడు. ఓ మృతదేహాన్ని కారులో వేసుకుని 350 కిలోమీటర్ల దూరంలో ఉన్న రోజ్ విల్లే పోలీస్ స్టేసన్ కు వెళ్లాడు. తన కారులో మృతదేహం ఉందని, తానే హత్య చేశానని పోలీసులకు తెలిపాడు. తాను నివసించే అపార్ట్ మెంట్ లో మరో మూడు మృతదేహాలు ఉన్నాయని వెల్లడించాడు.
పోలీసులు అతణ్ని అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తు చేపట్టారు. అపార్ట్ మెంట్ లో భయానక స్థితిలో ఉన్న మూడు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. శంకర్ నాగప్ప ఇలా సామూహిక హత్యలకు పాల్పడటానికి గల కారణాలు ఇంకా తెలియ రాలేదని, అతణ్ని విచారిస్తున్నామని రోజ్ విల్లే పోలీస్ చీఫ్ జోషువా సైమన్ తెలిపారు. మూడు రోజుల కిందటే అతను ఈ హత్యలు చేసి ఉంటాడని పోలీసులు వెల్లడించారు. మృతదేహాలు పడి ఉన్న తీరును బట్టి చూస్తే, హింసించి హత్య చేసి ఉండొచ్చని అనుమానిస్తున్నట్లు సైమన్ స్పష్టం చేశారు.
అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేపట్టినట్లు రోజ్ విల్లే పోలీసులు వెల్లడించారు. శంకర్ నాగప్ప ఆర్థిక పరిస్థితులు బాగుండటంతో.. ఈ హత్యకు ఆర్థికపరమైన కారణాలు ఉండకపోవచ్చని ప్రాథమికంగా నిర్దారించారు. కొంతకాలంగా అతను మానసిక ఒత్తిడితో బాధపడుతున్నాడని, ఈ కారణంతోనే సామూహిక హత్యలకు పాల్పడి ఉండొచ్చని అనుమానిస్తున్నట్లు తెలిపారు. హత్యలను తానే చేసినట్లు శంకర్ నాగప్ప అంగీకరించాడని, త్వరలోనే అతణ్ని న్యాయస్థానం ముందు హాజరుపర్చబోతున్నట్లు చెప్పారు. నాగప్ప పని చేస్తోన్న సంస్థ నుంచి మరింత సమాచారాన్ని సేకరిస్తామని పోలీసులు తెలిపారు.