భర్త శవంతో భారత సంతతి మహిళ జీవనం
మెల్బోర్న్: భర్త మృతదేహాన్ని ఇంట్లోనే పెట్టుకొని శవంతో పాటు వారాలుగా ఓ భారత సంతతి మహిళ జీవిస్తూ వచ్చింది. న్యూజిలాండ్లోని భారతీయ కుటుంబానికి చెందిన ఇంటి నుంచి వస్తున్న దుర్వాసను భరించలేక ఇరుగుపొరుగు వారు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు.
ఇంట్లోకి చేరుకున్న పోలీసులకు కుళ్లిపోయి చాలా దారుణ స్థితిలో ఉన్న 50 ఏండ్ల వ్యక్తి మృతదేహం కనిపించింది. ఈ ఘటన న్యూజిలాండ్లోని నార్త్ ఐలాండ్లో తితాహీబేలో చోటుచేసుకున్నది. మృతుడిని దేవీప్రసాద్ మజుందార్గా గుర్తించారు.
భార్యకు నచ్చజెప్పి మృత దేహాన్ని తొలగించారని న్యూజిలాండ్ హెరాల్డ్ అనే పత్రిక పేర్కొన్నది. ఏడాది క్రితం భారత్ నుంచి వచ్చి పక్క ఫ్లాట్లో చేరారు. గత కొద్దిరోజులుగా చెడు వాసన వస్తుండటంతో పలువురు మహిళను ఆరా తీయగా పిల్లి మలం అని ఒకసారి, చెత్త కుళ్లిందని మరోసారి చెప్పి ఇంటి చుట్టూ డెట్టాల్ పోసి మేనేజ్ చేసింది. రోజులు గడుస్తున్న కొద్ది వాసన రావడం ఎక్కువైంది.
తొలుత ఆహార పదార్థాలు కుళ్లి ఉండవచ్చని భావించామని, అయితే ప్రతి రోజు ఉదయం వాకింగ్కు వెళ్లే వ్యక్తి గత కొద్దిరోజులుగా కనిపించకపోవడంతో అనుమానం వచ్చిందని పక్కింట్లో నివసించే రంగిహునా అనే వ్యక్తి చెప్పారు. భర్త దేవీ ప్రసాద్ మృతదేహాన్ని ఎందుకలా ఇంట్లోనే పెట్టుకున్నది? ఆ వ్యక్తి మరణానికి కారణాలేంటీ? అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.