బ్యాంకు దోపిడీలు: భారత్ మహిళకు 66 జైలు శిక్ష
వాషింగ్టన్: బాంబులు వేసి బ్యాంకులు పేల్చేస్తానని బెదిరించి నాలుగు బ్యాంకులను లూటీ చేసిందనే ఆరోపణపై భారతీయ మహిళకు అమెరికా కోర్టు 66 నెలల జైలు శిక్ష విదించింది. అంతే కాకుండ నాలుగు బ్యాంకులలో లూటీ చేసిన రూ. రూ. 25 లక్షలు జరిమానాగా చెల్లించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
భారత సంతతికి చెందిన సందీప్ కౌర్ (24) అనే మహిళకు ఈ శిక్ష పడింది. 2014 వేసవి కాలంలో ఈమె నాలుగు బ్యాంకులలోకి వెళ్లి నగదు లూటీ చేసిందని అమెరికా పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేసి జైలుకు పంపించారు. అమెరికాలోకి కాలిఫోర్నియా కోర్టులో కేసు విచారణ జరిగింది.
సందీప్ కౌర్ తరపున న్యాయవాది విన్ వర్డ్ వాదించారు. పెద్దలు కుదిర్చిన వివాహం ఇష్టం లేకపోవడంతో సందీప్ కౌర్ అమెరికా వచ్చిందని అన్నారు. తరువాత ఆమె బాయ్ ఫ్రెండ్ ను వివాహం చేసుకునిందని, ఆ పెళ్లి పెటాకులు అయ్యిందని న్యాయస్థానం ముందు చెప్పాడు.
షేర్ మార్కెట్ వ్యాపారంలో ఈమె కొంత డబ్బు సంపాదించిన తరువాత లాస్ వేగాస్ లో జూదం అడి అప్ప్పుల్లో కూరుకుపోయిందని అన్నారు. చేసిన అప్పులు తీర్చడం కోసం బ్యాంకులలో దొంగతనం చెయ్యవలసి వచ్చిందని న్యాయమూర్తికి చెప్పారు.
తన క్లయింట్ సందీప్ కౌర్ బాగ చదువుకుందని, తక్కువ వయస్సు కావడంతో శిక్ష తగ్గించాలని కోర్టుకు మనవి చేశారు. బాంబులు వేస్తానని మాత్రమే బెదిరించిందని, కనీసం తుపాకి, ఏలాంటి ఆయుధం తీసుకు వెళ్లలేదని అన్నారు. న్యాయవాది వాదనతో ఏకీభవించని న్యాయస్థానం ఎలాంటి పరిస్థిలో శిక్షను తగ్గించమని తేల్చి చెప్పింది.