దొంగ వర్సిటీ, అడ్డగోలు వీసాలు: భారత విద్యార్థులు వెనక్కి
వాషింగ్టన్: అమెరికాలో వెలుగు చూసిన విశ్వవిద్యాలయం వీసాల కుంభకోణం నేపథ్యంలో దాదాపు 306 మంది భారత విద్యార్థులను వెనక్కి పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఇటీవల భారీ స్టింగ్ ఆపరేషన్ నిర్వహించి హెచ్-1బి వీసాల అక్రమాలకు పాల్పడిన 21 మంది అక్రమార్కులను అరెస్టు హోంలాండ్ సెక్యూరిటీ ఇన్వెస్టిగేషన్ అధికారులు అరెస్టు చేశారు.
ప్రస్తుతం వారు విద్యార్థులపై దృష్టి సారించారు. యూనివర్సిటీ ఆఫ్ నార్తర్న్న్యూజెర్సీ హెచ్1 - బీ వీసాల కుంభకోణానికి పాల్పడినట్లు గుర్తించారు. ఈ యూనివర్శిటీలో విద్యార్థులుగా అమెరికాలో కాలు పెట్టిన 306 మంది భారతీయ విద్యార్థులను అధికారులు గుర్తించారు చైనాకు చెందినవారు కూడా ఉన్నారు.
భారత విద్యార్థులను వెనక్కి పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు యూఎస్ఐసీఈ అధికార ప్రతినిధి అల్విన్ ఫిలిప్స్ తెలిపారు. యూఎ్సలో పెరిగిపోతున్న వీసా కుంభకోణాలను అరికట్టడం, అక్రమార్కులను పట్టుకోవడమే లక్ష్యంగా హోంలాండ్ సెక్యూరిటీ అధికారులు 2013 సెప్టెంబరులో యూనివర్సిటీ ఆఫ్ నార్తర్న్ న్యూజెర్సీ అనే నకిలీ వర్సిటీని సృష్టించారు.
ఇదే సమయంలో అక్రమార్కులు రంగప్రవేశం చేశారు. ఆ వర్సిటీలో చేరేందుకు ఆసక్తి చూపిన విద్యార్థుల నుంచి పెద్దమొత్తంలో డబ్బు తీసుకుని దాదాపు 1000 మందికి స్టూడెంట్, వర్క్ పర్మిట్ వీసాలు జారీ చేయించారు. అమెరికావ్యాప్తంగా భారీ స్థాయిలో వెలుగు చూసిన హెచ్ -1బి వీసా ఫ్రాడ్లో నలుగురు తెలుగువాళ్ల పాత్ర కూడా ఉన్నట్లు తెలిసింది.
భారత సంతతికి లేదా భారతీయ అమెరికన్లకు సంబంధించిన ఈ వీసా కుంభకోణం మంగళవారంనాడు వెలుగు చూసిన విషయం తెలిసిందే. అమెరికాలోని ఈ నకిలీ వర్సిటీ వీసాల ఫ్రాడ్లో అరెస్టైన వారిలో పది మంది భారతీయ అమెరికన్లు ఉన్నారు.
21 మంది నిందితుల్లో తేజేశ్ కొడాలి, కార్తిక్ నిమ్మల, గోవర్ధన్ ద్యావరశెట్టి, అవినాశ్ శంకర్ అనే తెలుగువాళ్లని తెలుస్తోంది. సయ్యద్ ఖాసీం అబ్బాస్ తదితర చైనా, భారత్కు చెందినవారి పేర్లు నిందితుల జాబితాలో ఉన్నాయి. ఈ కుంభకోణాన్ని విస్తృత దర్యాప్తు ద్వారా వెలుగులోకి తీసుకొచ్చినట్లు న్యూజెర్సీ అటార్ని పాల్ జె.ఫిష్మ్యాన్ తెలిపారు.