బ్రిటన్లో భారతీయులే నిర్ణేతలు: పార్లమెంట్ ఎన్నికలు
లండన్: బ్రిటన్ ఎన్నికలలో భారతీయులే నిర్ణేతలుకానున్నారు. భారతీయులు ఎవరికి ఓటు వేస్తే వారు అధికారంలోకి రానున్నారు. ఈ నెల 7వ తేదిన బ్రిటన్ లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. బ్రిటన్ లో మొత్తం 6.20 లక్షల మంది భారతీయులకు ఓటు హక్కు ఉంది.
144 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వాటిలో 45 స్థానాలలో భారత సంతతికి చెందిన వారు ఎవరు అధికారంలో ఉండాలి అని శాసించనున్నారు. అదే విదంగా 99 పార్లమెంట్ స్థానాలలో ఆసియా దేశాల వారి ఓట్లు కీలకం కానున్నాయి.
బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్ ఇప్పటికే భారతీయులు ఎక్కువగా నివాసం ఉంటున్న ప్రాంతాలలో సంచరించారు. తమ పార్టీకి ఓట్లు వేసి గెలిపించాలని, మీకు అన్ని విధాల అండగా ఉంటామని భారతీయులకు హామి ఇచ్చారు.
బ్రిటన్ లోని ప్రధాన రాజకీయ పార్టీల మేనిఫెస్టోలో ప్రవాస భారతీయులకు హామీల వర్షం కురిపించారు. బ్రిటన్ లో స్థిరపడిన విదేశీయులలో భారతీయులే ఎక్కవ మంది ఉన్నారు. 2010లో జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో ప్రవాస భారతీయులు లేబర్ పార్టీకి మద్దతు తెలిపారు. అయితే ఇప్పుడు లేబర్ పార్టీ మీద మన వారికి నమ్మకం పోయింది. ఈ ఎన్నికలలో లిబరల్ డెమాక్రాట్స్, కన్సర్వేటివ్స్ పార్టీలకు మద్దతు ఇచ్చే అవకాశం ఉందని సమాచారం.