ప్రధాని మోదీకి చేతికి సుత్తిని అందించిన ఆ దేశాధ్యక్షుడు..!!
జకర్తా: ఇండోనేసియాలోని బాలి వేదికగా ప్రతిష్ఠాత్మక జీ20 శిఖరాగ్ర సదస్సు ఇవ్వాళ ముగిసింది. జీ20 సభ్య దేశాల అధ్యక్షులు, ప్రధానమంత్రులు పాల్గొన్న ఈ సదస్సులో కీలక తీర్మానాలు ఆమోదం పొందాయి. రష్యా-ఉక్రెయిన్ మధ్య సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న యుద్ధం సహా పలు అంశాలపై సభ్య దేశాల అధ్యక్షులు, ప్రధానమంత్రులు చర్చించారు. తమ అభిప్రాయాలు, నిర్ణయాలతో కూడిన తీర్మానాన్ని సంయుక్తంగా ఆమోదించారు.
కీలక నేతలతో..
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ సెషన్స్లో పాల్గొన్నారు. ముగింపు రోజున ఆయన అమెరికా, ఫ్రాన్స్ అధ్యక్షులు జో బైడెన్, ఎమ్మానుయేల్ మక్రాన్ను కలిశారు. జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ ష్కాల్జ్, సింగపూర్ ప్రధాన మంత్రి లీ హెసెన్ లూంగ్తో భేటీ అయ్యారు. ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. భారత్-సింగపూర్, భారత్-జర్మనీ మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలు, ఆర్థిక అంశాలు ఈ సందర్భంగా వారి మధ్య చర్చకు వచ్చాయి. అంతకుముందు ప్రధాని మోదీ ఆయా దేశాల నేతలతో కలిసి మడ అడవులను సందర్శించారు. మొక్కలను నాటారు. సరదాగా గడిపారు.
రెండో రోజు సమ్మిట్లో..
ఆ వెంటనే రెండో రోజు సమ్మిట్లో వేర్వేరు సెషన్స్లో పాల్గొన్నారు. తొలి రోజు సెషన్స్లో ప్రధాని మోదీ తీరిక లేకుండా గడిపిన విషయం తెలిసిందే. ఆహారం, ఇంధన భద్రత అంశంపై ఏర్పాటైన వర్కింగ్ సెషన్లో పాల్గొన్నారు. ఆహార భధ్రత, ఎరువులు, ఇంధన అవసరాలను ఆయన ప్రస్తావించారు. జీ20 లీడర్స్ సమ్మిట్లో జో బైడెన్ను కలుసుకున్నారు. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, చైనా అధ్యక్షుడు గ్ఝి జిన్పింగ్తోనూ భేటీ అయ్యారు.
బ్యాటన్ అందజేత..
కాగా- తదుపరి జీ20 శిఖరాగ్ర సదస్సు భారత్లో ఏర్పాటు కానుంది. సెప్టెంబర్ 9, 10 తేదీల్లో ఈ సమ్మిట్ జరుగుతుంది. దీనికి సూచనగా మోదీ చేతికి బ్యాటన్గా చెక్కతో తయారు చేసిన సుత్తిని మోదీకి ఇండొనేషియా అధ్యక్షుడు జొకొ విడొడొ అందించారు. దాన్ని మోదీ స్వీకరించారు. అనంతరం ముగింపు సెషన్లో మాట్లాడారు. జీ20 తదుపరి శిఖరాగ్ర సదస్సుకు భారత్ ఆతిథ్యాన్ని ఇస్తోందనే విషయాన్ని ప్రస్తావించారు.
భారతీయుడికి గర్వకారణం..
తదుపరి జీ20 సమ్మిట్కు అధ్యక్షతను వహించబోతోండటం ప్రతి భారతీయుడికి గర్వకారణమని అన్నారు. భారత్లో ఏర్పాటు కాబోయే జీ20 సదస్సు.. ప్రపంచ సమైక్యతకు అద్దం పడుతుందని మోదీ వ్యాఖ్యానించారు. అందరినీ కలుపుకొని, ప్రతిష్ఠాత్మకంగా దీన్ని నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. నిర్మయాత్మక, కార్యాచరణ ప్రణాళికలను రూపొందించడానికి ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు. రాబోయే సంవత్సర కాలంలో జీ20 సమిష్టి కార్యాచరణకు ఊతమిచ్చేలా ఈ ప్రణాళిక ఉంటుందని మోదీ వివరించారు.
సభ్యదేశాలివే..
జీ20లో భారత్తోపాటు అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, దక్షిణ కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, టర్కీ, బ్రిటన్ అమెరికా, యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలు ఇందులో ఉన్నాయి. ఆయా దేశాల ప్రతినిధులందరూ వచ్చే సంవత్సరం భారత్లో జరిగే జీ20 శిఖరాగ్ర సదస్సుకు హాజరు కావాల్సి ఉంటుంది.