ఉక్రెయిన్లో నిలిచిపోయిన ఇంటర్నెట్ సేవలు; కమ్యూనికేషన్ లేక ప్రజల బెంబేలు
ఉక్రెయిన్ లో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. రష్యా సైనిక చర్య నేపథ్యంలో, కొనసాగుతున్న బాంబు దాడులతో, వైమానిక దాడులతో ఉక్రెయిన్ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. రష్యా దాడితో ఉక్రెయిన్లో ఎటుచూసినా భయానక దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా బాంబులు మోతే వినిపిస్తుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న ఆందోళన కనిపిస్తుంది. ఇదిలా ఉంటే ఒకరితో ఒకరికి సంబంధాలు లేకుండా ఉక్రెయిన్ లో ఇంటర్నెట్ సేవలు కూడా నిలిచిపోవడం అక్కడ ఉన్నవారికి ఆందోళన కలిగిస్తుంది.

ఉక్రెయిన్ లో చాలా నగరాల్లో నిలిచిపోయిన ఇంటర్నెట్
రాజధాని కీవ్ తో సహా పలు ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. తమ సమాచారాన్ని ఇతర ప్రాంతాల్లో ఉన్న తమ వారికి పంచుకునే వీలు కూడా లేకుండా ఇంటర్నెట్ నిలిచిపోవటంతో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఒకపక్క పొరుగు దేశాలకు పారిపోవడానికి ప్రయత్నిస్తున్న ఉక్రెయిన్ వాసులు, మరోపక్క యథేచ్ఛగా కొనసాగుతున్న రష్యా బాంబు దాడులు వెరసి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇతర దేశాలలో తలదాచుకోవటానికి వెళ్ళిన వారికి ఉక్రెయిన్ లో ఉన్న తమ వారి సమాచారం కూడా అందని పరిస్థితి నెలకొంది.

తెలుగు విద్యార్థుల పరిస్థితి తెలియక కన్నీరు మున్నీరు అవుతున్న భారత్ లోని తల్లిదండ్రులు
ఇక ఇదే సమయంలో ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయులకు సైతం దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ నిలిచిపోవడంతో ఏం జరుగుతుందో సమాచారం లేని పరిస్థితి నెలకొంది. తమ వారి పరిస్థితి ఎలా ఉందో తెలియక భారత్ లో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఉక్రెయిన్ లో చదువుకుంటున్న భారతీయ విద్యార్థులతో కమ్యూనికేషన్ కూడా లేకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఖార్కివ్ లో ఇంటర్నెట్ డౌన్ .. చాలా నగరాల్లో ఇదే పరిస్థితి
రష్యా దాడి కారణంగా దేశంలోని ఇప్పటికే ఇంటర్నెట్ కనెక్టివిటీ లేకుండా పోయింది. ప్రస్తుతం, రష్యా సరిహద్దు నుండి 25 మైళ్ల దూరంలో దేశం యొక్క ఈశాన్యంలో ఉన్న ఉక్రెయిన్ యొక్క రెండవ అతిపెద్ద నగరమైన ఖార్కివ్ చుట్టూ ఇంటర్నెట్ కు సంబంధించి అంతరాయాలు కేంద్రీకృతమై ఉన్నట్లు తెలుస్తోంది. జార్జియా టెక్లోని ఇంటర్నెట్ ఔటేజ్ డిటెక్షన్ అండ్ అనాలిసిస్ (IODA) ప్రాజెక్ట్ అంతరాయాలను నివేదించింది. ఖార్కివ్తో సహా ఉక్రెయిన్ అంతటా అనేక నగరాలు మరియు ఇతర ప్రాంతాలకు సేవలు అందించే ట్రియోలాన్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్పై అంతరాయాలు ప్రభావం చూపుతున్నాయి. ఇంటర్నెట్ పని చెయ్యటం లేదు.

టెలికాం మౌలిక సదుపాయాలపై రష్యా దాడి ఫలితం .. భయానక స్థితిలో ఉక్రెయిన్ ప్రజలు
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇంటర్నెట్ కు అంతరాయం కలిగించడానికి పవర్ గ్రిడ్లను పేల్చివేయడం లేదా సెల్ టవర్ల వంటి ఇంటర్నెట్ మౌలిక సదుపాయాలపై దాడి చేయడం వంటివి చేసి గందరగోళం సృష్టిస్తున్నారని భావిస్తున్నారు.
టెలికాం మౌలిక సదుపాయాలపై దాడి చేయడం ద్వారా, విధ్వంసం సృష్టించటం ద్వారా , అంతర్గత కనెక్షన్ల ద్వారా, సైబర్ దాడుల ద్వారా సాంకేతిక పరంగా కూడా రష్యా ఉక్రెయిన్ పై దాడి చేస్తోంది. దీంతో ప్రస్తుతం కమ్యూనికేషన్ కూడా లేని పరిస్థితి ఉక్రెయిన్ లో నెలకొంది. దీంతో ప్రపంచంతో సంబంధం లేక అనేక ఉక్రెయిన్ నగరాలు భయానక పరిస్థితులలో ఉన్నాయి.












Click it and Unblock the Notifications