వీధుల్లో శవాల గుట్టలు: 2,000 మంది బలి!
ఇరాన్ దేశంలో గత రెండు వారాలుగా కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు రక్తసిక్తంగా మారాయి. ఈ ఘర్షణల్లో ఇప్పటివరకు దాదాపు 2,000 మంది మరణించినట్లు ఇరాన్ ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు మంగళవారం ధ్రువీకరించారు. దేశవ్యాప్తంగా సాగుతున్న ఈ ఆందోళనల్లో ఇంత భారీ స్థాయిలో మరణాలు సంభవించాయని అధికారులు అంగీకరించడం ఇదే మొదటిసారి.
ఘర్షణల వెనుక 'ఉగ్రవాదులు': ఇరాన్ ఆరోపణ
అంతర్జాతీయ మీడియా సంస్థతో మాట్లాడిన సదరు ఇరాన్ అధికారి.. ఈ మరణాలకు నిరసనకారులు కారణం కాదని, వారి ముసుగులో ఉన్న 'ఉగ్రవాదులే' పౌరులను, భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు. మరణించిన వారిలో భద్రతా సిబ్బంది ఎంతమంది ఉన్నారనే ఖచ్చితమైన వివరాలను ప్రభుత్వం ఇంకా వెల్లడించలేదు. అయితే అమెరికా, ఇజ్రాయెల్ దేశాలే ఈ అశాంతిని ప్రేరేపిస్తున్నాయని ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మండిపడ్డారు.

ఆర్థిక సంక్షోభమే నిరసనలకు పునాది
గతేడాది ఇజ్రాయెల్, అమెరికా జరిపిన దాడుల అనంతరం ఇరాన్ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటడం, కరెన్సీ విలువ పడిపోవడంతో సామాన్య ప్రజలు వీధుల్లోకి వచ్చారు. 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత ఇరాన్ ప్రభుత్వం ఎదుర్కొంటున్న అతిపెద్ద అంతర్గత సవాలుగా దీనిని నిపుణులు అభివర్ణిస్తున్నారు.
అణచివేత.. ఇంటర్నెట్ బ్లాకౌట్
ప్రభుత్వం ఓ వైపు ఆర్థిక సమస్యలపై నిరసనలు న్యాయమైనవేనని చెబుతూనే, మరోవైపు భద్రతా దళాలతో ఉక్కుపాదం మోపుతోంది. సమాచారం బయటకు రాకుండా దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. ఇప్పటివరకు 10,000 మందికి పైగా నిరసనకారులను భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నట్లు అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు పేర్కొంటున్నాయి. సోషల్ మీడియాలో లీక్ అవుతున్న వీడియోలలో తూటాల వర్షం, కాలిపోతున్న భవనాలు, వాహనాలు కనిపిస్తున్నాయి. ఇవి అక్కడి భయానక పరిస్థితులకు అద్దం పడుతున్నాయి.
అంతర్జాతీయ ఒత్తిడి
ఇరాన్ పరిస్థితిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. శాంతియుత నిరసనకారులపై హింసను ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించడమే కాకుండా, ఇరాన్తో వాణిజ్యం చేసే దేశాలపై 25 శాతం టారిఫ్ విధిస్తామని ప్రకటించారు.












Click it and Unblock the Notifications