సూసైడ్ డ్రోన్స్ : ఇరాన్ అమ్ములపొదిలో కొత్త అస్త్రం
ఇరాన్ : రక్షణ అవసరాల కోసం ఆయా దేశాలు కొత్త కొత్త ఆవిష్కరణలకు నాంది పలుకుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఇరాన్ ఆత్మాహుతి డ్రోన్స్ ను తయారు చేసింది. సూసైడ్ డ్రోన్స్ గా పరిగణించబడే ఈ డ్రోన్స్.. అవసరమైతే తమను తాము పేల్చేసుకుని శత్రు శిబిరాన్ని వినాశనం చేయగలవు.
ఇరాన్ అభివృద్ధి చేసిన ఈ సూసైడ్ డ్రోన్స్.. ఉపరితలంపైనే గాక నీటిపై ఉన్న లక్ష్యాలను కూడా పేల్చివేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. నీటిపై కేవలం రెండంటే రెండడుగుల ఎత్తులో ఎగురుతూ 250 కి.మీ వేగంతో ప్రయాణించగల సామర్థ్య ఈ డ్రోన్స్ సొంతమని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ వెల్లడించింది. 250కి.మీ నుంచి అత్యధికంగా 3వేల కి.మీ వరకు ఎగరగలిగే ఈ డ్రోన్స్ కు పగలే కాకుండా, రాత్రి పూట కూడా స్పష్టంగా చూడగలిగే ఆత్యాధునిక కెమెరాలను అమర్చారు.
నిర్దేశించిన లక్ష్యం కమాండ్ సెంటర్ అయినా, లేక నౌక లాంటిదైనా సరే ఈ డ్రోన్స్ ద్వారా నేరుగా ఢీకొట్టి ధ్వంసం చేయవచ్చు. ప్రాథమికంగా తీరా ప్రాంత నిఘా కోసమే వినియోగించే ఈ డ్రోన్స్ అత్యవసరమైతే ఆత్మాహుతి కోసం కూడా వినియోగించువచ్చునని రివల్యూషనరీ గార్డ్స్ ప్రకటించింది.