ఆ 100 మంది మిలటరీ అధికారులను చంపేయండంటూ ఐసీస్ పిలుపు
న్యూఢిల్లీ: ఇరాక్లోని ఐఎస్ఐఎస్ స్ధావరాలపై వైమానిక దాడులు జరుపుతున్న అమెరికా సైన్యంపై పగ తీర్చుకునేందుకు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు కొత్త తరహా వ్యూహాన్ని పన్నారు. అమెరికా సైన్యంలో ప్రముఖులైన 100 మంది ఆఫీసర్ల పేర్లు, ఫోటోలతో పాటు ఇంటి అడ్రస్లను శనివారం ఇంటర్నెట్లో పోస్ట్ చేశారు.
అనంతరం 'అమెరికాలో నివసిస్తోన్న అన్నదమ్ముల్లారా ఆ 100 మంది వివరాలు ఇప్పుడు మీకు పూర్తిగా తెలిశాయి. వెంటనే వారిని చంపేయండి' అంటూ ఇస్లామిక్ స్టేట్ హ్యాకింగ్ డివిజన్ ఆన్లైన్లో పోస్ట్ చేశారు. అంతేకాదు అమెరికా మిలటరీ సర్వీసులు, డేటాబేస్, ఈమెయిల్స్ను కూడా హ్యాక్ చేసినట్లు పేర్కొన్నారు.

ఈ ఇంటర్నెట్ పోస్టుల ఒక్కసారిగా అమెరికా మొత్తం కలకలం రేపాయి. దీనిపై స్పందించిన పెంటగాన్ అధికారి ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టామని, ఎలాంటి విపత్కర పరిస్ధితుల్నినైనా ఎదుర్కొనే సత్తా అమెరికా సైన్యానికి ఉందన్నారు. పబ్లిక్ రికార్డులు, ఇంటి చిరునామాలు, సోషల్ మీడియా ద్వారా బహిరంగ సమాచారాన్ని మాత్రమే ఉగ్రవాదులు సేకరించగలిగారని, తమ వెబ్సైట్లు ఎలాంటి హ్యాకింగ్కు గురి కాలేదన్నారు.












Click it and Unblock the Notifications