కాబూల్ విమానాశ్రయం జంట పేలుళ్లకు బాధ్యత మాదే: ఆత్మాహుతుడి ఫొటో రిలీజ్ చేసిన ఐఎస్
కాబూల్: తాలిబన్లు అనుమానించినట్లుగానే ఐఎస్ ఉగ్రవాదులే ఆప్ఘాన్ రాజధాని కాబూల్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద జంట పేలుళ్లకు పాల్పడినట్లు తేలిపోయింది. స్వయంగా ఐఎస్ ఉగ్రవాదులే ఈ జంట పేలుళ్ల దాడులకు బాధ్యత వహిస్తున్నట్లు తాజాగా ప్రకటించారు.
గురువారం సాయంత్రం కాబూల్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద సంభవించిన జంట పేలుళ్లలో ఇప్పటి వరకు 60 మంది మరణించగా, 150 మంది వరకు తీవ్రగాయాలపాలయ్యారు. మొదటి పేలుడు బారన్ హోటల్ వద్ద సంభవించగా, రెండో కాబూల్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద పేలింది. విమానాశ్రయం ఆవరణలో భారీగా జనం ఉండటంతో ప్రాణనష్టం పెరిగింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఆప్ఘాన్ ఐఎస్కు అనుబంధమైన ఐఎస్ఐఎస్-ఖోరసన్ ఈ పేలుళ్లకు తమదే బాధ్యత అని గురువారం రాత్రి ప్రకటించింది. అంతేగాక, ఆత్మాహుతి దాడికి పాల్పడిన వ్యక్తి ఫొటోను కూడా విడుదల చేసింది. జనంలోకి వెళ్లిన అతడు తను తాను పేల్చుకున్నట్లు వెల్లడించింది. ఈ రెండు పేలుళ్తతోపాటు మరో రెండు పేలుళ్లకు కుట్ర పన్నినట్లు తెలిపింది. మూడో పేలుడు తాలిబన్ వాహనాన్ని పేల్చివేసిందని పేర్కొంది.
కాబూల్ జంట పేలుళ్లలో 60కి చేరిన మరణాలు, 150 మందికి తీవ్రగాయాలు
ఆప్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ అంతర్జాతీయ విమానాశ్రయం వెలుపల గురువారం సాయంత్రం జరిగిన జంట పేలుళ్లలో మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ పేలుళ్లలో ఇప్పటి వరకు 60 మంది మృతి చెందారు. వీరిలో నలుగురు యూఎస్ మెరైన్స్ కూడా ఉన్నారు. 150 మందికిపైగా పౌరులు తీవ్రగాయాలపాలయ్యారు. వీరిలో ముగ్గురు అమెరికా సైనికులు ఉన్నారు.
మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నారని తెలుస్తోంది. గాయపడినవారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. ఘటనా స్థలం భీతావాహంగా మారింది. చెల్లాచెదురుగా పడివున్న మృతదేహాలు, గాయపడినవారి ఆర్తనాదాలతో ఘటనా స్థలాలు హృదయవిదారకంగా మారాయి. కాగా, మొదట పేలుడు బారన్ హోటల్ వద్ద జరిగింది. ఆ తర్వాత రెండో పేలుడు కాబూల్ అంతర్జాతీయ విమానాశ్రయం అబ్బే గేట్ సమీపంలో చోటు చేసుకుంది.
ఇతర దేశాలకు వెళ్లేందుకు వేలాది మంది విమానాశ్రయం ఆవరణలో వేచివున్న విషయం తెలిసిందే. ఉగ్రవాదులు భారీ జనసమూహాన్ని లక్ష్యంగా చేసుకునే ఈ ఆత్మాహుతి దాడులకు పాల్పడినట్లు తెలుస్తోంది. అయితే, తాలిబన్లు ఈ దాడికి పాల్పడలేదని అంటున్నారు. ఐఎస్ ఉగ్రవాదులే ఈ పేలుళ్లకు పాల్పడివుంటారని తాలిబన్లు చెబుతుండటం గమనార్హం.
ఆగస్టు 31 వరకు తరలింపు గడువు విధించడంతో వేలాది మంది ప్రజలు విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ క్రమంలోనే ఉగ్రవాదులు పేలుళ్లకు పాల్పడటంతో భారీ ప్రాణనష్టం జరిగింది. గురువారం ఉదయమే ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉందని అమెరికా వర్గాలు వెల్లడించగా.. కొద్ది గంటల సమయంలోనే ఉగ్రవాదులకు దాడులకు దిగడం సంచలనంగా మారింది.
పేలుళ్ల ఘటనతో ఆయా దేశాలు తమ పౌరులను వెంటనే తమ తమ దేశాలకు తరలించేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నాయి. భారత్ ఇప్పటికే 600 మందికిపైగా పౌరులను స్వదేశానికి తీసుకొచ్చింది. అయితే, దీరిలో పలువురు ఆప్ఘాన్ పౌరులు కూడా ఉన్నారు. తాజాగా, మరో 140 మంది హిందువులు, సిక్కులను తీసుకొచ్చేందుకు ప్రయత్నించగా.. గురువారం తాలిబన్లు అడ్డుకున్నారు. దీంతో వారు కాబూల్ విమానాశ్రయంలోనే ఉండిపోయారు. వీరిని కూడా భారత్ తీసుకొచ్చేందుకు విదేశాంగ శాఖ ప్రయత్నాలను కొనసాగిస్తోంది.
దాడులు ఐఎస్ ఉగ్రవాదుల పనేనంటూ తాలిబన్ నేతలు
ఆప్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద జరిగిన జంట పేలుళ్ల ఘటనలను తాలిబన్లు ఖండించారు. ఇలాంటి ఘటనలను తాము అంగీకరించబోమని తెలిపారు. అంతేగాక, ఈ పేలుళ్లకు ఐఎస్ ఉగ్రవాదులే కారణమని భావిస్తున్నట్లు పేర్కొన్నారు తాలిబన్ అధికార ప్రతినిధి జుబిహుల్లా ముజహిద్.
Recommended Video
అమెరికా ఇప్పటికే ఉగ్రవాద దాడి జరగవచ్చని హెచ్చరించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. తాలిబన్ల నేలను ఉగ్రవాదులు ఉపయోగించుకునేందుకు ఎంతమాత్రమూ అంగీకరించబోమని స్పష్టం చేశారు. ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని, నిందితులను చట్టం ముందు నిలబెడతామని మరో తాలిబన్ అధికార ప్రతినిధి సుహిల్ షాహీన్ తెలిపారు.