అంతంకాదిది ఆరంభమేనా..? కరోనాకు పోయేకాలం లేదా..? మళ్లీ ఉలిక్కి పడ్డ వుహాన్ నగరం..!
బీజింగ్/హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి కరతాళ నృత్యం చేస్తోంది. కరోనా ఉద్భవించిన చైనాలో తగ్గుముఖం పట్టినట్టే పట్టి మరోసారి పంజావిసిరింది. వుహాన్ నగరంలో 36 రోజుల విరామం తర్వాత తాజా కేసు సమోదు కావడంతో చైనా ప్రభుత్వం ఉలిక్కి పడింది. దీంతో వుహాన్ నగరంలోనే కోటి మందికి కరోనా పరీక్షలు నిర్వహించేందుకు రంగం సిద్దం చేస్తోంది చైనా ప్రభుత్వం. కేవలం పది రోజుల్లోనే కోటి మందికి కరోనా టెస్టులు నిర్వహణలో భాగంగా రోజుకు పది లక్షల మందికి కరోనా పాజిటీవ్ పరీక్షలు నిర్వహించేందుకు చైనా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ అంతం కాదు ఆరంభం అనే చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది.
ఉలిక్కి పడ్డ చైనా దేశం.. అనూహ్యంగా పెరుగుతున్న కేసులు..
కంటికి కనిపించని కరోనా వైరస్ తాజాగా ప్రపంచ దేశాలన్నింటిని గడగడలాడిస్తోంది. దీని బారినపడ్డ వారు నిర్ధాక్షిణ్యంగా ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ మహమ్మారి వైరస్కు వ్యాక్సిన్ లేకపోవడంతో, రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. ఇది ప్రజల ఆరోగ్యంపైనే కాకుండా దేశాల ఆర్ధిక వ్యవస్థను కూడా చావు దెబ్బ తీసింది ఈ కరోనా వైరస్. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 43 లక్షలు దాటిపోయింది. వీరిలో పదహారు లక్షల మంది కోలుకోగా, దాదాపు మూడు లక్షల మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. అంతే కాకుండా గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ప్రపంచ వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది.
వుహాన్ లో ఊడి పడ్డ కరోనా.. అప్రమత్తమైన చైనా ప్రభుత్వం..
ఇక కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య కూడా ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ మహమ్మారి నుంచి కోలుకుని, ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య మరీ అంత పెద్దగా లేకపోయినప్పటికి ఆశాజనకంగా ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికాలో కరోనా విళయ తాండవం చేస్తోంది. ఇప్పటికే అక్కడ 14 లక్షలకు పైగా కేసులు నమోదవ్వగా, 83 వేల మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. మరో మూడు లక్షల మంది వరకు కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇక స్పెయిన్, ఇటలీ, బ్రిటన్, రష్యాలలో లక్షల్లో కేసులు నమోదయ్యాయి.
వుహాన్ లో కోటి మందికి టెస్టులు.. రోజుకు పది లక్షల మందికి పరీక్షలు..
ప్రస్తుతం చైనాలో మళ్లీ కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. అక్కడ సోమవారం ఒక్కరోజే 17 కేసులు నమోదయ్యాయి. ఇందులో ఐదు వుహాన్ నగరంలో నమోదయ్యాయి. ఇక జిలిన్ ప్రావిన్సులోని షూలన్ నగరంలో కొత్తగా పదకొండు కేసులు నమోదు అయ్యాయి. దీనితో నగరాన్ని లాక్డౌన్ చేశారు. షూలన్ నగరంలో ఉన్న అన్ని పబ్లిక్ స్థలాలను మూసివేశారు. నగరవాసులందర్నీ ఇళ్లలోనే ఉండాలంటూ ఆదేశాలు జారీ చేసారు. ఇక ప్రజా రవాణా వ్యవస్థను కూడా నిలిపేశారు. ఆ నగరాన్ని తీవ్ర కరోనా ప్రభావిత ప్రాంతంగా ప్రకటించారు. ఇక చైనాలో మళ్లీ కేసులు పునరావృతం కావడంతో అక్కడ పరిస్థితి ఆందోళనకారంగా మారింది.
Recommended Video
చైనా కొత్త కేసులపట్ల ప్రపంచ దేశాల ఆందోళన.. ఇప్పట్లో తగ్గే అవకాశం లేనట్టేనా..?
కరోనా వైరస్ పుట్టిన వుహాన్ లో ఇప్పుడు మళ్ళీ కరోనా తొలి కేసు రెండో వెర్షన్ లో మొదలయింది. వెళ్ళినట్టే వెళ్ళిన కరోనా మళ్ళీ వుహాన్ లో అడుగు పెట్టింది. అక్కడ 36 రోజుల తర్వాత తొలి కరోనా కేసు నమోదు అయిందని అధికారులు పేర్కొన్నారు. ఇప్పటి వరకు అక్కడ వుహాన్ పక్కనే ఉన్న హుబే ప్రావిన్స్ లోనే కరోనా కేసులు వచ్చాయి. రెండు మూడు నెలల క్రితం వుహాన్ కి చుక్కలు చూపించిన కరోనా వైరస్ ని చాలా జాగ్రత్తగా చైనా కట్టడి చేసింది. ఇప్పుడు అక్కడ సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. కోటి మంది జనాభా ఉన్న నగరంలో ఇప్పుడు మళ్ళీ కరోనా కేసు రావడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రజలందరికి యుద్ద ప్రాతిపదికన రోజుకు 10లక్షల చొప్పున మొత్తం పది రోజుల్లో కోటి మందికి టెస్టులు నిర్వహించాలని చైనా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దీంతో కరోనా అంతం కాదు ఆరంభం అనే చర్చ జరుగుతోంది.