బక్రీద్ పూట గొర్రెలకు బదులు.. మనుషుల్ని బలిచ్చిన ఐసిస్
మోసుల్ : ఐసిస్ తీవ్రవాద సంస్థ మరో దారుణానికి ఒడిగట్టింది. బక్రీద్ పండుగ పూట గొర్రెలకు బదులు తమ వద్ద బంధీలుగా ఉన్నవారి పీకలు కోసి అత్యంత దారుణంగా హతమార్చింది. అనంతరం తమ పైశాచికత్వాన్ని ఎప్పటిలాగే ఇంటర్నెట్ లో వీడియో రూపంలో పోస్ట్ చేసింది ఐసిస్.
తెలియవస్తున్న సమాచారం ప్రకారం.. ఈశాన్య సిరియాలోని దెయిర్ అల్ జోర్ పట్టణంలో ఐసిస్ ఈ దారుణానికి ఒడిగట్టినట్టు సమాచారం. పట్టణంలోని ఓ జంతువధ శాలలో బంధీలను గొర్రెల్లా వేలాడదీసి వారి గొంతు కోసేశారు ఐసిస్ జిహాదీలు. అమెరికా సైన్యం తరుపున సిరియాలో గూఢచర్యం నెరిపిన వ్యక్తులు అన్న అనుమానంతో ఐసిస్ వారిని బందీలుగా పట్టుకుంది.
ఈ క్రమంలోనే ఐసిస్ తన తాజా మారణ హోమానికి మేకింగ్ ఆఫ్ ఇల్లూషన్ అని టైటిల్ పెట్టడం గమనార్హం. ఐసిస్ చరిత్రలోనే ఇదో అత్యంత దారుణమైన ఘటన అని సిరియన్ మానవ హక్కుల కార్యకర్త అబూ మొహమ్మద్ అభిప్రాయపడ్డారు. 12 నిముషాల నిడివి గల ఈ వీడియోలో.. ఇటీవలి పారిస్ ఈఫిల్ టవర్ దాడి, నీస్ ట్రక్కు దాడితో పాటు మిషన్ ఇంపాజిబుల్ 5 లోని కొన్ని సినిమా దృశ్యాలను వీడియోలో పొందుపర్చింది ఐసిస్.