ఐఎస్ఐఎస్ స్పోక్ మెన్ అద్నానీ హతం
బీరుట్: ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్)కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అమెరికా, సిరియా సంయుక్త బలగాల దాడిలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద గ్రూప్ అధికార ప్రతినిధి అబు అహమ్మద్ అల్ అద్నానీ అంతం అయ్యాడు.
సిరియాలోని అలెప్పో ప్రావిన్స్ ప్రాంతంలో ఐఎస్ఐఎస్ ఉగ్రవాద నాయకులను లక్షంగా చేసుకుని వైమానిక దాడులు జరిపామని అమెరికా తెలిపింది. అద్నానీ మరణించాడని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ దృవీకరించింది.
కాల్పులు పర్యవేక్షించడానికి వెళ్లిన అద్నానీని అమెరికా, సిరియా సంయుక్త బలగాలు చాకచక్యంగా అంతం చేశాయి. ఐఎస్ఐఎస్ కి చెందిన కీలక సీనియర్ నేతలను లక్షంగా చేసుకుని దాడులు చేస్తామని అమెరికా ప్రకటించిన మరుసటి రోజే అద్నానీ అంతం అయ్యాడు.
సిరియాలోని అల్ బాబ్ ప్రాంతంలో ఐఎస్ఐఎస్ నాయకులను లక్షంగా చేసుకుని వైమానిక దాడులు చేస్తున్నారు. అద్నానీని అంతం చేసి తాము విజయం సాధించామని అమెరికా, సిరియా తెలిపాయి.
అయితే అద్నానీ అంతం అయినంత మాత్రాన తమకు నష్టం లేదని, అద్నానీ లాంటి వారు పదుల సంఖ్యలో పోరాటం చేయ్యడానికి ముందుకు వస్తారని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ తెలిపింది.
అలెప్పో మీద పట్టుకోసం అద్నానీ ఆధ్వర్యంలోనే ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు కొంత కాలం నుంచి దాడులు చేస్తున్నారు. ఈ విషయం పసిగట్టిన సంయుక్త బలగాలు అద్నానీని టార్గెట్ చేసుకుని అంతం చేశాయి.