మలేషియా హిందూ ఆలయం పేల్చివేతకు ఐఎస్ కుట్ర
కౌలాలంపూర్: మలేషియాలో ప్రముఖ హిందూ ఆలయాన్ని పేల్చివేయాలని ఇస్లామిక్ స్టేట్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) ఉగ్రవాదులు కుట్రపన్నారు. విషయం పసిగట్టిన మలేషియా పోలీసులు ముగ్గురు ఉగ్రవాదులను అరెస్టు చేశారు.
మలేషియా స్వాతంత్ర దినోత్సవం (ఆగస్టు 31) తేది ప్రజలు భారీ సంఖ్యలో రోడ్ల మీదకు వచ్చి సందడి చేస్తారు. అలా చెయ్యడం అక్కడి అనవాయితి. అదే రోజు కౌలాలంపూర్ లో ప్రముఖ హిందూ దేవాలయాన్ని పేల్చి వెయ్యాలని కుట్రపన్నారు.
కౌలాలంపూర్ లోని బాతు కేవ్స్ సమీపంలోని మలేషియా మురగన్ దేవాలయాన్ని టార్గెట్ చేసుకున్నారు. అదేవిధంగా ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ పరికరాల విక్రయ సంస్థలను పేల్చడానికి సిద్దం అయ్యారు.
ఫ్రాన్స్ ఇండిపెండెన్స్ డే సందర్బంగా ఉగ్రవాదులు సృష్టించిన నరమేథంలాంటిది మలేషియాలో జరిగే అవకాశంఉందని ఉగ్రవాద నిరోధక ప్రత్యేక శాఖ పోలీసులు గుర్తించారు. రెండు ప్రాంతాల్లో సోదాలు చేసి ముగ్గురు ఉగ్రవాదులను పట్టుకున్నారు.
బాతు కేవ్స్ లోని మలేషియా మురగన్ ఆలయం పేల్చివేయడానికి ప్లాన్ వేసిన ముగ్గురు ఉగ్రవాదులు 30 ఏళ్ల లోపువారే అని పోలీసులు చెప్పారు. ఉగ్రవాదుల నుంచి గ్రనేడ్లు, తుపాకులు, 24 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు.
ఒకరు లారీ డ్రైవర్, ఒకరు కూల్ డ్రింక్స్ విక్రయదారుడు, మరొకరు కసాయిదారుడిగా పని చేస్తున్నారని, ఆలయం పేల్చి వేసిన తరువాత సిరియా వెళ్లిపోవడానికి సిద్దం అయ్యారని పోలీసులు తెలిపారు.
మలేషియాలో ఏ సినిమా షూటింగ్ జరిగినా బాతు కేవ్స్ లోని హిందూ ఆలయం తప్పనిసరిగా ఉంటుంది. ముందుగా సమాచారం అందడంతో కోలాలంపూర్ లో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు దాడి చెయ్యకుండా అడ్డుకున్నామని మలేషియా పోలీసు అధికారులు తెలిపారు.