చేపలమ్ముతున్న ఐఎస్ ఉగ్రవాదులు: భారీ సంపాదన
బాగ్దాద్: ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) ఉగ్రవాదులు చేపలు అమ్ముతున్నారట. చేపల అమ్మకం వ్యాపారంతో ఉగ్రవాదులు మిలియన్ల డాలర్ల డబ్బు సంపాదిస్తున్నారట. తమ సంపదను పెంచుకోవడానికి చేపలతోపాటు కార్ల వ్యాపారంలోకి వారు అడుపెట్టారట.
అసలు విషయం ఏమిటంటే.. ఇరాక్లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు చమురు కేంద్రాలపై చాలా డబ్బు సంపాదించేవారు. అయితే ఇటీవల అమెరికా ఆధ్వర్యంలోని సేనలు చమురు కేంద్రాల లక్ష్యంగా వైమానిక దాడులు చేసిన సంగతి తెలిసిందే. చాలా చోట్ల చమురుకేంద్రాలను ఉగ్రవాదుల ఆధీనం నుంచి సైన్యం లాగేసుకుంది. దీంతో వారు డబ్బు సంపాదించడానికి వేరే మార్గాలు వెతుక్కుంటున్నారు.
చేపలు అమ్మడంతో పాటు కార్ల డీలర్షిప్లు, ఫ్యాక్టరీల ద్వారా ఉగ్రవాదులు మిలియన్ డాలర్ల డబ్బు సంపాదిస్తున్నట్లు ఇరాక్ అధికారులు వెల్లడించారు. ఉగ్రవాదుల ఆధీనంలో ఉన్న ప్రాంతాల్లోని వందలాది సరస్సులు, చేపల చెరువుల్లోని చేపలు అమ్మి మిలియన్ల డాలర్లు సంపాదిస్తున్నారని చెప్పారు.
డబ్బులు బాగా వస్తుండటంతో చేపలు పెంచే వారి వద్ద నుంచి చెరువులు లాక్కుంటున్నారు ఉగ్రవాదులు. కొందరు యజమానులు చెరువులను వదిలేసి పారిపోగా, కొందరు చంపేస్తారేమోనని భయంతో ఉగ్రవాదులకు సహకరిస్తున్నారు. దీంతో ఉగ్రవాదులు ఏడాదికి 2.9బిలియన్ డాలర్ల ఆదాయాన్ని సంపాదిస్తున్నారని చెప్పారు.
కాగా, 2007 నుంచే ఉగ్రవాదులకు చేపల అమ్మకం ద్వారా వచ్చే ఆదాయం అందుతోంది. వీటితో పాటు ఉగ్రవాదులు కార్ల డీలర్షిప్ తీసుకుంటున్నారు. వారి ఆధీనంలో ఉన్న మౌసుల్ తదితర నగరాల్లో ప్రభుత్వ ఫ్యాక్టరీలను కూడా నడిపించి డబ్బు సంపాదించి తమ కార్యకలాపాలను విస్తృతం చేసుకుంటున్నారు.