మసీదులో ఆత్మాహుతి దాడి: 13మంది మృతి
కువైట్ సిటీ: కువైట్ రాజధానిలోని షియా ముస్లింల వర్గానికి చెందిన మసీదులో ఆత్మాహతి దాడి జరిగింది. రంజాన్ సందర్భంగా నగరంలోని అల్-ఇమామ్-అల్-సాదిఖ్ మసీదులో శుక్రవారం ప్రార్థనలు జరుగుతుండగా ఆత్మాహుతి దాడి జరిగింది.
ఈ ఘటనలో 13 మంది మృతిచెందినట్లు సమాచారం. మరికొందరు గాయపడ్డారు. మసీదులో ప్రార్థనలు చేసుకుంటుండగా.. ఆత్మాహుతి బాంబర్ ప్రవేశించి తనకు తాను పేల్చుకోవడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.

కాగా, సోషల్ మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం.. ఈ ఆత్మాహుతి దాడికి పాల్పడింది తామేనని ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ పేర్కొంది. అబూ సులేమాన్ అనే ఆత్మాహుతి బాంబర్ ఈ పేలుడుకు పాల్పడినట్లు ఐఎస్ తెలిపింది.
షియా ముస్లింలను ఉద్దేశించి ‘టెంపుల్ ఆఫ్ రెజెక్షనిస్ట్' అనే పదాన్ని ఉపయోగించిన ఐఎస్.. ఈ దాడికి తామే పాల్పడినట్లు పేర్కొంది. ఇంతకుముందు కూడా షియా ముస్లింలే లక్ష్యంగా సౌదీ అరేబియా మసీదు, యెమన్లలో ఐఎస్ ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు.












Click it and Unblock the Notifications