భారత్ వాదనను తోసిపుచ్చిన బంగ్లాదేశ్..! ఆ ప్రచారం వెనుక ?
బంగ్లాదేశ్ లో తాజాగా హిందూ మైనార్టీలతో జరుగుతున్న దాడులు, మూక హత్యలు భారత్ లో అశాంతిని రేపుతున్నాయి. ఒకప్పుడు బంగ్లాదేశ్ కు స్వాతంత్రం ప్రసాదించిన భారత్ లో ఇప్పుడు అదే బంగ్లాదేశ్ పై ఆగ్రహం పెల్లుబుకుతోంది. తాజాగా దీపు చంద్ర దాస్ అనే వ్యక్తిపై మూకదాడి చేసి హతమార్చిన తర్వాత అమృత్ మండల్ అనే మరో వ్యక్తిపై దాడి చేసి పొట్టనబెట్టుకున్నారు. దీనిపై తాజాగా బంగ్లాదేశ్ కు భారత్ ఫిర్యాదు చేసింది.
బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులు ఆమోదయోగ్యం కాదని, తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని, ఈ దాడుల దోషుల్ని వదిలిపెట్టబోమని తాజాగా భారత విదేశాంగశాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ ఇవాళ స్పందించింది. బంగ్లాదేశ్లో మైనారిటీ వర్గాలపై హింసకు సంబంధించి భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇటీవల చేసిన వ్యాఖ్యలను బంగ్లాదేశ్ తోసిపుచ్చింది. వాటిని తప్పుదారి పట్టించే వ్యాఖ్యలుగా అభివర్ణించింది. హిందువులతో సంబంధం ఉన్న నేర సంఘటనలను వ్యవస్థాగత హింసగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించింది.

అలాగే తన దీర్ఘకాలిక మత సామరస్య సంప్రదాయాన్ని బంగ్లాదేశ్ గుర్తుచేసింది. హిందువులపై విస్తృత వివక్షకు రుజువుగా జరుగుతున్న హింసాత్మక సంఘటనలను పెద్దవిగా చేసి, తప్పుగా చిత్రీకరించడానికి చేసిన ప్రయత్నాలకు చింతిస్తున్నట్లు పేర్కొంది. భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో బంగ్లాదేశ్ వ్యతిరేక భావాలను ప్రచారం చేయడానికి ఇటువంటి కథనాలను దుర్మార్గంగా ఉపయోగిస్తున్నారని ఆరోపించింది. తమ దేశంలో హిందువులపై జరిగిన దాడుల్లో దోపిడీ ప్రయత్నంలో మరణించిన నేరస్థుడితో సంబంధం ఉన్న కేసు కూడా ఉందని తెలిపింది. దీన్ని మైనార్టీలకు లింక్ చేయడంపై అభ్యంతరం తెలిపింది.












Click it and Unblock the Notifications