ఇజ్రాయెల్ బిగ్ స్టేట్ మెంట్- గాజాపై పూర్తి కంట్రోల్..!!
Israel: హమాస్, హెజ్బొల్లా మిలిటెంట్ గ్రూపులపై వరుసబెట్టి దాడులు సాగిస్తూ వస్తోన్న ఇజ్రాయెల్ మరో అడుగు ముందుకేసింది. గాజాపై కన్నేసింది. ఈ ప్రాంతం మొత్తాన్నీ కూడా తన నియంత్రణలోెకి తెచ్చుకోవాలని నిర్ణయించుకుంది. ఈ దిశగా తన వైమానిక దాడులను మరింత ముమ్మరం చేసింది.
ప్రతీకారదాడులతో ఏడాదిన్నర కాలంగా మధ్య తూర్పు దేశాలు భగ్గుమంటోన్న విషయం తెలిసిందే. రోజుల తరబడి దాడులు ప్రతిదాడులు కొనసాగుతోన్నాయి. ఈ రీజియన్ చల్లారట్లేదు. ఇజ్రాయెల్, గాజా, లెబనాన్ రోజూ పరస్పర దాడులకు దిగుతోన్నాయి. గాజాలో హమాస్, లెబనాన్లో హెజ్బొల్లా మిలిటెంట్ గ్రూపులను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ మిస్సైళ్లు, రాకెట్లను సంధిస్తూ వస్తోంది.

ఈ దాడుల్లో ఈ రెండు గ్రూప్లకు చెందిన పెద్ద తలకాయలు తెగిపడ్డాయి. హసన్ నస్రల్లా, యాహ్యా సిన్వర్, ఇస్మాయిల్ హనియె, సమీ తాలెబ్ అబ్దల్లా, ఫతా షరీఫ్, మర్వాన్ ఇసా, ఇబ్రహిం వకీల్, అహ్మద్ వహ్బీ.. వంటి సీనియర్ నాయకులు, కమాండర్లు హతం అయ్యారు. హషెమ్ షఫియొద్దీన్, హుస్సేన్ అలీ హజీమాను మట్టుపెట్టింది ఇజ్రాయెల్.
దీనికి కారణాలు లేకపోలేదు. 2023 అక్టోబర్ 7వ తేదీన హమాస్ ఇజ్రాయెల్పై భీకర దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. అప్పట్లో ఇజ్రాయెల్ సరిహద్దు ప్రాంతాలకు చెందిన పలువురిని అపహరించింది హమాస్. దీనికి ప్రతీకారాన్ని తీర్చుకుంటూ వచ్చింది ఇజ్రాయెల్. ఈ ఏడాది ద్వితీయార్థం నుంచీ క్రమం తప్పకుండా డ్రోన్ దాడులను నిర్వహించింది.
హెజ్బొల్లా, హమాస్..ఈ రెండింటినీ ఏకకాలంలో మట్టుపెట్టింది. లెబనాన్, గాజాల్లో మొత్తంగా 1,300లకు పైగా ఆయా మిలిటెంట్ గ్రూపుల స్థావరాలపై ఈ దాడులు సాగించింది ఇజ్రాయెల్. బీకా వ్యాలీ,సిడాన్, మర్జయాన్, నబాటి, టయర్, జెజ్ఝీన్, జెహ్రానీ జిల్లాలతో పాటు తూర్పు ప్రాంతంలోని జహ్లేయ్, బాల్బెక్, హెర్మెల్ వంటి ప్రాంతాలపై నిరంతరాయంగా దాడులు సాగుతోన్నాయి.
ఈ దాడుల్లో హమాస్ చీఫ్ కమాండర్ మహ్మద్ సిన్వర్ మరణించినట్లు అల్ హదత్ తెలిపింది. గాజాలోని ఖాన్ యూనిస్ లో గల ఓ టన్నెల్ లో సిన్వర్ మృతదేహాన్ని గుర్తించారు. గత ఏడాది అక్టోబర్ లో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో హతమైన యాహ్యా సిన్వర్ తమ్ముడే ఈ మహ్మద్ సిన్వర్. యాహ్యా తరువాత హమాస్ చీఫ్ గా బాధ్యతలను స్వీకరించాడు.
ఈ పరిణామాల మధ్య ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు.. సంచలన ప్రకటన చేశారు. గాజాను పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకోనున్నట్లు ప్రకటించారు. గాజాలో.. హమాస్ మిలిటెంట్లకు వ్యతిరేకంగా విస్తృతమైన ఆర్మీ కార్యకలాపాలను ప్రారంభించినట్లు తెలిపారు.
మొన్నటివరకు వైమానిక దాడులు మాత్రమే కొనసాగగా.. ఇప్పుడు సైన్యం కూడా ఈ దాడుల్లో అడుగు పెట్టినట్టిందనే విషయాన్ని ఆయన పరోక్షంగా వెల్లడించారు. హమాస్ పై తమ పోరాటం తీవ్రతరమైందని, మంచి పురోగతి సాధిస్తోన్నామని నెతన్యాహు చెప్పారు. గాజా స్ట్రిప్ లోని అన్ని భూ భాగాలను కూడా తాము నియంత్రణలోకి తెచ్చుకుంటామని స్పష్టం చేశారు.
ఈ మేరకుటెలిగ్రామ్లో ఓ వీడియో పోస్ట్ చేశారాయన. గాజాను తాము ఎటువంటి పరిస్థితుల్లోనూ వదులుకోబోమని తేల్చిచెప్పారు. విజయం సాధించాలంటే.. మరింత దూకుడుగా, ఎవ్వరూ అడ్డుకోలేని విధంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. దౌత్యపర కారణాల వల్ల గాజా ప్రజలు కరవులో విలవిల్లాడకూడదని, అక్కడికి ఆహారాన్ని సరఫరా చేస్తామని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications