యూఎస్ ఎన్నికల వేళ.. కేబినెట్ నుంచి రక్షణ మంత్రి బర్తరఫ్
Benjamin Netanyahu: కొద్ది రోజులుగా వరుస దాడులతో లెబనాన్, గాజాలను కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది ఇజ్రాయెల్. లెబనాన్లో హెజ్బొల్లా, గాజాలో హమాస్ మిలిటెంట్ గ్రూపులను బెంబేలెత్తిస్తోంది. వాటిని నామరూపాల్లేకుండా మట్టుబెట్టడానికి శాయశక్తులా ప్రయత్నాలు సాగిస్తోంది.
ఇప్పటికే ఈ రెండు మిలిటెంట్ గ్రూప్లకు చెందిన కీలక నేతలను హతమార్చింది. రెండు నెలలుగా ఇజ్రాయెల్ నిర్వహిస్తూ వస్తోన్న దాడుల్లో హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ చీఫ్ హషెమ్ షఫియొద్దీన్ దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. లెబనాన్ రాజధాని బీరుట్లో గల హెజ్బొల్లా ఇంటెలిజెన్స్ ప్రధాన కార్యాలయంపై సాగించిన డ్రోన్ దాడుల్లో ఆయన హతం అయ్యారు.

ఈ పరిణామాల మధ్య ఇటీవలే ఇజ్రాయెల్పై భీకర దాడులకు దిగింది హెజ్బొల్లా. ఆ దేశ ఉత్తర ప్రాంతంపై విరుచుకుపడింది. జనావాసాలను సైతం లెక్క చేయలేదు. మెటులా, హైఫా ప్రాంతాలపై భారీగా రాకెట్లను సంధించింది. ఈ ఘటనల్లో ఏడుమంది దుర్మరణం పాలయ్యారు. వారిలో ఇద్దరు ఇజ్రాయెల్ పౌరులు కాగా మిగిలిన ముగ్గురు విదేశీయులు.
లెబనాన్ సరిహద్దులకు ఆనుకుని ఉంటుంది మెటులా. ఆపిల్ను పెద్ద ఎత్తున పండిస్తారిక్కడ. ఇక్కడి వ్యవసాయ క్షేత్రాలపై హెజ్బొల్లా పెద్ద ఎత్తున రాకెట్లతో దాడి చేసింది. ఈ ఘటనలో పొలాల్లో పని చేస్తోన్న అయిదుమంది మరణించారు. పంటపొలాలు భారీగా ధ్వంసం అయ్యాయి. దీని తరువాత హైఫాపై దాడులను చేపట్టింది. ఇక్కడి ప్రధాన నగరం కిర్యాట్ అటపై బాంబుల వర్షాన్ని కురిపించింది.
దీని తరువాత ఇజ్రాయెల్లో అనూహ్య పరిణామాలు సంభవించాయి. ఆ దేశ రక్షణ మంత్రి యోవ్ గాల్లంట్ ఉద్వాసనకు గురయ్యారు. మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయ్యారు. ఈ మేరకు ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పరిణామం చోటు చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
యోవ్ గాల్లంట్ తొలగింపుపై వివరణ సైతం ఇచ్చారు నెతన్యాహు. చాలాకాలంగా ఆయనపై పూర్తి నమ్మకాన్ని ఉంచానని, రెండు నెలలుగా ఆయన పనితీరుపై విశ్వాసం సన్నగిల్లుతూ వచ్చిందని అన్నారు. అందుకే ఆయనపై వేటు వేయాల్సి వచ్చిందని చెప్పారు. గత ఏడాది అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయెల్పై మారణహోమం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
అదే సమయంలో యోవ్ గాల్లంట్ స్థానంలో ఇజ్రాయెల్ కట్జ్ను రక్షణ మంత్రిగా అపాయింట్ చేశారు నెతన్యాహు. ఇప్పుడు ఆయన సారథ్యంలో రక్షణ మంత్రిత్వ శాఖ మరింత సమర్థవంతంగా దాడులను ఎదుర్కొనగలమని నెతన్యాహు అభిప్రాయపడుతున్నట్లు అక్కడి మీడియా తెలిపింది.












Click it and Unblock the Notifications