పట్టువదలని విక్రమార్కుడిలా ట్రంప్: ఎన్నికల ఫిక్సింగ్: జార్జియా గవర్నర్కు ఫోన్: కలకలం
వాషింగ్టన్: అమెరికాలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు కొనసాగుతోన్న వేళ.. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ఓటమిని అంగీకరించడానికి ఏ మాత్రం సుముఖంగా లేరు. అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడి రోజులు గడుస్తున్నకొద్దీ ఆయన తన పాత పాటనే వినిపిస్తూ వస్తున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని, డెమొక్రాట్లు కుట్రపూరితంగా వ్యవహిరించారంటూ మండిపడుతున్నారు. అత్యంత మోసపూరిత ఎన్నికలుగా ఇవి అమెరికా చరిత్రలో నిలిచిపోతుందని అంటున్నారు.
జార్జియాలోోని వెల్డొస్టాలో రిపబ్లికన్లు నిర్వహించిన ర్యాలీలో ఆయన తన భార్య మెలానియాతో కలిసి పాల్గొన్నారు. తన మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగించారు. జార్జియాలో తొలుత భారీ ఆధిక్యతను కనపరిచిన డొనాల్డ్ ట్రంప్.. ఆ తరువాత క్రమంగా వెనుకబడ్డారు. 12,670 ఓట్ల తేడాతో ఈ రాష్ట్రాన్ని కోల్పోయారు. ఇప్పుడు అదే జార్జియాలో డొనాల్డ్ ట్రంప్.. భారీ ర్యాలీని చేపట్టారు. అధ్యక్ష ఎన్నికలను ముందే ఫిక్స్ చేశారని ఆరోపించారు.
ప్రజల అభిప్రాయాలు, వారి ఓట్లతో సంబంధం లేకుండా డెమొక్రాట్లను గెలిపించాలని ముందే నిర్ణయించుకున్నారని విమర్శించారు. బ్యాలెట్ల లెక్కింపులో అనేక అవకతవకలు చోటు చేసుకున్నాయని ఆయన పునరుద్ఘాటించారు. దీనికి సంబంధించిన సాక్ష్యాధారాలను సైతం తాము అందజేసినపప్పటికీ.. న్యాయస్థానాలు పట్టించుకోలేదని చెప్పారు. ఈ పరిణామాల మధ్య డొనాల్డ్ ట్రంప్.. జార్జియా గవర్నర్ బ్రియాన్ కెంప్కు ఫోన్ చేశారు. లెజిస్లేచర్లతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు.
Recommended Video
బ్యాలెట్ సిగ్నేచర్లపై ఆడిట్ నిర్వహించాలని ఆదేశించారు. తమకు ఆ అధికారం లేదని కెంప్ ఈ సందర్భంగా ట్రంప్కు సూచించారు. ప్రభుత్వం ఇంకా ఏర్పాటు కాకముందే ఆడిట్ నిర్వహించాల్సిన అధికారం తమకు లేదంటూ కెంప్ పేర్కొనడం పట్ల డొనాల్డ్ ట్రంప్ అసహనాన్ని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కాగా- బ్రియాన్ కెంప్ కార్యాలయం మాత్రం ఈ విషయాన్ని కొట్టి వేసింది. బ్యాలెట్ పేపర్ల ఆడిట్ కోసం ట్రంప్ ఫోన్ చేయలేదని స్పష్టం చేసింది. జార్జియా రిపబ్లికన్ల ఎన్నికల ప్రచార కమిటీ ప్రతినిధి హ్యారిసన్ డీల్ మరణం పట్ల సంతాపం తెలపడానిక ట్రంప్ ఫోన్ చేసినట్లు పేర్కొంది.