ఇవాంకా పర్యటన: హైదరాబాద్లో హై అలర్ట్, 3 రోజులు గోల్కొండకు నో ఎంట్రీ, అర్థరాత్రికల్లా బార్లు బంద్!
భాగ్యనగరంలో మూడ్రోజులపాటు గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్షిప్ సమ్మిట్(జీఈఎస్) జరగనున్న నేపథ్యంలో మాదాపూర్, హైటెక్ సిటీ ప్రాంతాల్లో ఎక్కడ చూసినా పోలీసులే కనిపిస్తున్నారు.
Recommended Video
హైదరాబాద్ : భాగ్యనగరంలో మూడ్రోజులపాటు గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్షిప్ సమ్మిట్(జీఈఎస్) జరగనున్న నేపథ్యంలో మాదాపూర్, హైటెక్ సిటీ ప్రాంతాల్లో ఎక్కడ చూసినా పోలీసులే కనిపిస్తున్నారు.
ఘోరం: ఇవాంకా వస్తోందని.. వీధి కుక్కలకు విషమిచ్చి..., ట్విట్టర్లో స్పందించిన కేటీఆర్
ఈ నెల 28, 29, 30 తేదీల్లో హెచ్ఐసీసీలో జరగనున్న అంతర్జాతీయ సదస్సుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్, ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ప్రపంచ వ్యాప్తంగా 1600 మంది ప్రతినిధులు రానుండడంతో ప్రత్యేక భద్రతా చర్యలు చేపడుతున్నారు.
హైదరాబాద్ లో హై అలర్ట్...
ఇప్పుడు యావత్ ప్రపంచం దృష్టి హైదరాబాద్ లోని మాదాపూర్పై ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రాష్ట్ర పోలీసులు, కేంద్ర బలగాలతో పాటు అమెరికా శ్వేతసౌధానికి చెందిన అధికారులు సైతం భద్రతను పర్యవేక్షించనున్నారు. ఇప్పటికే ప్రధాన కూడలితో పాటు సదస్సు జరిగే, విదేశీ ప్రతినిధులు సంచరించే, బస చేసే ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అంతర్జాతీయ సదస్సు నేపథ్యంలో దాదాపు 15 రోజుల నుంచే సైబరాబాద్ కమిషనరేట్తో పాటు రాచకొండ, హైదరాబాద్ కమిషనరేట్ పోలీసు ఉన్నతాధికారులు భద్రతపై దృష్టి సారించారు. డ్రోన్ కెమెరాలతో భద్రతను పర్యవేక్షిస్తున్నారు. ఇవాంకా ట్రంప్తో పాటు దేశ, విదేశాలకు చెందిన ప్రతినిధులు మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, కొండాపూర్, గోల్కొండ, చార్మినార్ వంటి ప్రాంతాల్లో బస చేయనున్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వం ఇప్పటికే హై అలర్ట్ ప్రకటించింది. దీంతో పాటు వెస్టిన్, రాడిసన్, లెమన్ ట్రీ, ట్రెడెంట్, నోవాటెల్ హోటళ్ల వద్ద పోలీసులు గస్తీని ముమ్మరం చేశారు.
పర్యాటకులకు మూడ్రోజులు నో ఎంట్రీ...
ఈ నెల 29వ తేదీన గోల్కొండ కోటకు 1,500 మంది విదేశీ ప్రతినిధులు బృందం రానుంది. వీరికి ప్రభుత్వం గోల్కొండ కోటలో విందు ఏర్పాటు చేసింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని గోల్కొండ కోటలో వారం రోజులు ముందునుంచే కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేపట్టారు. కోటను పూర్తిగా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రతినిధి బృందానికి అవసరమైన ఏర్పాట్లు చేసేందుకు వీలుగా గోల్కొండ కోటలో మూడు రోజులు పాటు పర్యాటకులను ఎవరినీ అనుమతించడం లేదు. గోల్కొండ కోట నుంచి చుట్టూ రెండు కిలోమీటర్ల మేర పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. కోట ప్రధాన ద్వారం వద్ద ప్రత్యేక చెక్పోస్ట్ ఏర్పాటు చేశారు. టాస్క్ఫోర్స్, ఇంటలిజెన్స్, డాగ్, బాంబ్ స్క్వాడ్ బృందాలు క్షుణ్ణంగా తనిఖీలు చేపడుతున్నాయి.
ఎవరొచ్చారు? ఎందుకొచ్చారు? ఏం చేస్తారు?
బుధవారం ఉదయం నుంచే మాదాపూర్ లోని ఆయా బస్తీల్లో పోలీసుల సెర్చింగ్ మొదలైంది. ఇంటింటికీ వెళ్లి ఇంట్లో ఎవరెవరు ఉంటున్నారంటూ వివరాలను సేకరిస్తున్నారు. ఈ మధ్యకాలంలో కొత్త వ్యక్తులు ఎవరైనా వచ్చారా? వస్తే ఎందుకొచ్చారు? ఏం పని చేస్తున్నారు? ఎన్ని రోజులు ఉంటారు? ఇలా అన్ని వివరాలు ఆరా తీస్తున్నారు. గుర్తింపు కార్డులను తనిఖీ చేస్తున్నారు. అంతర్జాతీయ సదస్సుకు వచ్చే విదేశీ ప్రతినిధులు ఈ నెల 29 సాయంత్రం 7 గంటలకు గోల్కొండ కోటలో విందుకు హాజరుకానున్న నేపథ్యంలో ఇప్పటి నుంచే గోల్కొండను పూర్తిగా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
అర్థరాత్రికల్లా బార్లు బంద్...
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో బార్ అండ్ రెస్టారెంట్లను కూడా రాత్రి 12 గంటలకల్లా మూసివేయాలని సైబరాబాద్ కమిషనర్ సందీప్శాండిల్య ఆదేశాలు జారీ చేశారు. జీఈఎస్ సదస్సుకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె, ఆయన సలహాదారు అయిన ఇవాంకా ట్రంప్ వస్తున్న సంగతి తెలిసిందే. ఆమెతోపాటు దేశ విదేశాల నుంచి వందలాది మంది ప్రముఖ వ్యాపారవేత్తలు కూడా రానున్నారు. మెట్రో రైలు ప్రారంభోత్సవానికి వస్తున్న ప్రధాని మోడీ కూడా ఈ సదస్సులో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో బార్ అండ్ రెస్టారెంట్స్ను రాత్రి 12 తర్వాత తప్పనిసరిగా మూసేయాల్సిందేనని, లేదంటే చట్టపరమైన చర్యలు తప్పవని సైబరాబాద్ కమిషనర్ ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు.