పాక్ లో భారీ విధ్వంసం- ఎగిరిపడ్డ బోగీలు
Jaffer Express: బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ తిరుగుబాటులో అష్టకష్టాలు పడుతోన్న పాకిస్తాన్ లో మరో దిగ్భ్రాంతికర సంఘటన చోటు చేసుకుంది. బలోచిస్తాన్ లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో జాఫర్ ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పింది. మొత్తం నాలుగు బోగీలు చెల్లాచెదురు అయ్యాయి. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడినట్లు ప్రాథమికంగా అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.
పాకిస్తాన్ లో అత్యంత సమస్యాత్మక, సున్నిత ప్రాంతం.. బలూచిస్తాన్ ప్రావిన్స్. ఇక్కడ బలోచ్ ఆర్మీకి గట్టి పట్టు ఉంది. ఆ దేశ ప్రభుత్వ కార్యకలాపాలు ఇక్కడ చాలాకాలంగా సాగట్లేదు. ఇటీవలే తమది స్వతంత్ర దేశంగా కూడా ప్రకటించుకుంది బలోచ్ ఆర్మీ.

అలాంటి ప్రాంతంలో జాఫర్ ఎక్స్ప్రెస్ మరోసారి భారీ దాడికి గురైంది. ఖైబర్ ఫఖ్తున్ ఖ్వా ప్రావిన్స్ లోని పెషావర్ నుంచి బలూచిస్తాన్ లోని క్వెట్టా వెళ్తున్న సమయంలో ఈ దాడి సంభవించింది. మార్గమధ్యలో జకోబాబాద్ సమీపంలో పట్టాలు తప్పింది. రైల్వే ట్రాక్పై సంభవించిన శక్తిమంతమైన పేలుడు ధాటికి నాలుగు బోగీలు చెల్లాచెదురు అయ్యాయి. పేలుడు ధాటికి పట్టాలపై దాదాపు మూడు అడుగుల లోతు గొయ్యి ఏర్పడింది. సుమారు ఆరు అడుగుల మేర ట్రాక్ను ధ్వంసమైంది.
ఈ పేలుడు ఘటనను పోలీసు అధికారులు ధృవీకరించారు. ట్రాక్ పై అమర్చిన ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ (IED) వల్లే ఈ పేలుడు సంభవించిందని వెల్లడించారు. ఈ దాడి తీవ్రతకు పలు బోగీలు భూమిలో కూరుకుపోయాయి. నాలుగు బోగీలు చెల్లాచెదురు అయ్యాయి. పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. ఎంతమంది మరణించారనేది ఇంకా అధికారికంగా తెలియరావట్లేదు.
సమాచారం అందిన వెంటనే పోలీసులు, భద్రత సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని జకోబాబాద్ ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
బలూచిస్తాన్ వేర్పాటువాద గ్రూపులు ఈ దాడికి పాల్పడి ఉండవచ్చని ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ దాడికి తాము బాధ్యత వహిస్తోన్నట్లు బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ నుంచి ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. బలూచిస్తాన్ ప్రావిన్స్ లో రైల్వే మౌలిక సదుపాయాలు, భద్రతా సిబ్బందిపై బీఎల్ఏ తరచూ దాడులకు పాల్పడుతూ వస్తోన్న విషయం తెలిసిందే.
జాఫర్ ఎక్స్ప్రెస్ పై దాడి జరగడం ఇది మొదటిసారి కాదు. ఈ ఏడాది మార్చిలో.. బీఎల్ఏ సుమారు 350 మంది ప్రయాణికులతో ఉన్న ఈ రైలును హైజాక్ చేసింది. ఈ సందర్భంగా చోటు చేసుకున్న ఆపరేషన్ లో 100 మందికి పైగా పాకిస్తాన్ సైనికులు మరణించారు. 35 మంది బందీలు చనిపోయారు.












Click it and Unblock the Notifications