పౌరసత్వ సవరణ బిల్లు ఎఫెక్ట్, భారత పర్యటనపై జపాన్ ప్రధాని అనాసక్తి, టూర్ రద్దు..?
పౌరసత్వ సవరణ సెగలతో అసోం అట్టుడుకుతోంది. సవరణ చట్టాన్ని వెనక్కి తీసుకోమని ఆందోళన కారులు ఆందోళన బటపట్టారు. పరిస్థితి చేయిదాటడంతో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు పౌరులు చనిపోయిన సంగతి తెలిసిందే. అసోం రాజధాని గువహటి నిరసనలతో హోరెత్తుతుంది. దీంతో తన పర్యటనపై జపాన్ ప్రధాని షింజో అబే తర్జన భర్జన పడుతున్నట్టు తెలిసింది.
గువహటిలో ఆందోళనల నేపథ్యంలో శిఖరాగ్ర సదస్సుకు హాజరయ్యేందుకు షింజో అబే విముఖత వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఈ మేరకు జపాన్ మీడియా జీజీ పేర్కొన్నది. కానీ దీనిని అధికారులు ధ్రువీకరించాల్సి ఉంది. గువహటిలో ఈ నెల 15-17 వరకు శిఖరాగ్ర సదస్సు నిర్వహించాలని భారతప ప్రభుత్వం భావించింది. ఆ మేరకు ఏర్పాట్లు కూడా చేసింది.
పౌరసత్వ సవరణ బిల్లు పార్లమెంట్ ముందుకురావడం, ఆమోదం పొందడంతో నిరసనలు మిన్నంటాయి. దీంతో తన పర్యటనను రద్దుచేయాలని షింజో అబే భావిస్తున్నట్టు తెలుస్తోంది. కానీ దీనిని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ ధ్రువీకరించలేదు. పర్యటన రద్దుకు సంబంధించి తమకు ఎలాంటి సమాచారం లేదని పేర్కొన్నారు.
అంతకుముందు ఆదివారం నుంచి జపాన్ ప్రధానమంత్రి పర్యటన ప్రారంభమవుతుందని రవీశ్ కుమార్ తెలిపారు. కానీ పౌరసత్వ సవరణ బిల్లుతో పరిస్థితి మారిపోయింది. దీంతో భారత్ వచ్చేందుకు షింజో అబే నిరాకరించినట్టు తెలుస్తోంది. ఆయన పర్యటన రద్దుకు సంబంధించి ఆ దేశం అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది.