జో బైడెన్ కీలక నిర్ణయం: ఆ వయస్సు 18 నుంచి 21కి పెంపు: ఏకే 47..బ్యాన్
వాషింగ్టన్: ఈ మధ్యకాలంలో యథేచ్ఛగా చోటు చేసుకున్న కాల్పుల ఉదంతాలు- అగ్రరాజ్యం అమెరికాను తీవ్ర భయాందోళనలకు గురి చేశాయి. కొన్ని కీలక నిర్ణయాలను తీసుకునే దిశగా ప్రేరేపించాయి. అడ్డు అదుపు లేకుండా సాగుతున్న తుపాకుల సంస్కృతిపై ఉక్కుపాదం మోపే దిశగా కదిలించాయి. రక్తపాతాన్ని నివారించడానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కొన్ని కీలక నిర్ణయాలను ప్రకటించారు. త్వరలోనే వాటిపై చట్టాలను తీసుకొస్తామని వెల్లడించారు.
18 ఏళ్ల కుర్రాడు.. కాల్పులు..
కిందటి నెల 25వ తేదీన టెక్సాస్లో ఓ టీనేజర్.. తన తోటి విద్యార్థులపై బుల్లెట్ల వర్షాన్ని కురిపించిన విషయం తెలిసిందే. విచక్షణారహితంగా జరిపిన ఈ కాల్పుల్లో 21 మంది దుర్మరణం పాలయ్యారు. పలువురు విద్యార్థులు, ఉపాధ్యాయులకు బుల్లెట్ గాయాలయ్యాయి. టెక్సాస్లోని ఉవాల్డే ప్రాంతంలో గల రాబ్ ఎలిమెంట్రీ స్కూల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ టీనేజర్ వయస్సు 18 సంవత్సరాలే. హ్యాండ్గన్తో కనిపించిన వారిపై కనిపించినట్టే కాల్పులు జరిపాడు.
ఓక్లహామా ఆసుపత్రిలో..
ఈ ఘటనతో అమెరికా మొత్తం ఉలిక్కిపడింది. ఈ దిగ్భ్రాంతికర ఘటన పట్ల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సంతాప సూచకంగా అమెరికా జాతీయ పతాకాన్ని అవనతం చేశారు. అంతకుముందు- 2018లో ఫ్లోరిడాలోని మార్జరీ స్టోన్మేన్ డగ్లస్ హైస్కూల్లో ఇదే తరహాలో కాల్పుల ఉదంతం చోటు చేసుకుంది. అప్పట్లో 17 మంది మరణించారు. రెండు రోజుల కిందటే ఓక్లహామాలోని టుల్సా ఆసుపత్రిలో ఆగంతకుడు జరిపిన కాల్పుల్లో నలుగురు మృతిచెందారు. 2022లో టుల్సా కాల్పుల ఘటన 233వదిగా గన్ వయోలెన్స్ ఆర్కైవ్స్ అనే సంస్థ వెల్లడించింది.
కీలక నిర్ణయాలు..
ఓక్లహామా కాల్పుల తరువాత జో బైడెన్ కొన్ని కీలక నిర్ణయాలను ప్రకటించారు. దేశంలో హై కెపాసిటీ బుల్లెట్ మేగజైన్లను నిషేధించనున్నట్లు తెలిపారు. కొద్దిసేపటి కిందటే ఆయన దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అస్సాల్ట్ వెపన్లకు కూడా ఈ నిషేధం వర్తిస్తుందని తెలిపారు. ఇకపై దేశంలో అస్సాల్ట్ వెపన్స్, హైకెపాసిటీ బుల్లెట్ మేగజైన్లు సాధారణ పౌరుల కోసం అందుబాటులో ఉండవని అన్నారు. ప్రభుత్వ విభాగాలు, అధికారులు మాత్రమే పరిమితంగా వాటిని వినియోగించేలా చట్టాన్ని తీసుకొస్తామని చెప్పారు.
ఏకే 47 సహా..
అస్సాల్ట్ వెపన్స్ వినియోగాన్ని పదేళ్ల పాటు నిషేధిస్తూ 1994లో యూఎస్ కాంగ్రెస్ తీర్మానాన్ని ఆమోదించింది. 2004 వరకు ఈ నిషేధం కొనసాగింది. ఆ పదేళ్ల కాలంలో సామూహిక కాల్పుల ఉదంతాలు తగ్గాయి. నిషేధ కాలం ముగిసిన తరువాత మళ్లీ కాల్పుల ఘటనలు సంభిస్తున్నాయని, దీన్ని పునఃసమీక్షించాల్సిన అవసరం ఏర్పడిందని జో బైడెన్ అన్నారు. ఏకే 47, ఏకే 15 సహా.. తొమ్మిది రకాల అస్సాల్ట్ వెపన్స్ను నిషేధించేలా చట్టాన్ని తెస్తామని చెప్పారు.
తుపాకుల కొనుగోలు వయస్సు పెంపు
అమెరికాలో 18 సంవత్సరాలు నిండిన వారెవరైనా తుపాకులను కొనుగోలు చేయవచ్చు. ఈ వయస్సు నిబంధనను పొడించనున్నట్లు జో బైడెన్ చెప్పారు. ఇకపై 21 సంవత్సరాలు నిండిన వారే గన్స్ పర్ఛేజ్ చేయాల్సి ఉంటుందని అన్నారు. దీనిపై చట్టాన్ని తీసుకుని రావాలని ఆయన యూఎస్ కాంగ్రెస్ను కోరారు. హైకెపాసిటీ మేగజైన్స్లో 30 రౌండ్ల వరకు కాల్పులు జరిపేలా బుల్లెట్స్ను నింపవచ్చని, వాటిని కూడా నియంత్రించాలని సూచించారు.