కౌంటింగ్ ఆగదు.. మా లీగల్ టీమ్ని దింపుతాం... బైడెన్ వర్గం కౌంటర్.. 2000 నాటి పరిస్థితులు?
అమెరికా అధ్యక్ష ఎన్నికలు తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి. ఇప్పటివరకూ వెల్లడైన ట్రెండ్స్ ప్రకారం అధ్యక్షుడు ట్రంప్ కంటే డెమోక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ ముందంజలో ఉన్నారు. అయితే ఇంకా పలు రాష్ట్రాల్లో కౌంటింగ్ పూర్తి కావాల్సి ఉండటంతో... చివరి నిమిషంలో ఏదైనా జరగవచ్చునన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు... ఊహించినట్లుగానే ట్రంప్.. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ పూర్తి కాకముందే తామే గెలిచినట్లు ప్రకటించేశారు. అంతేకాదు,ఫలితాలపై తాను సుప్రీం కోర్టును ఆశ్రయించనున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలపై జో బైడెన్ వర్గం స్పందించింది.
అమెరికా ఎన్నికల్లో ఆంధ్రా మహిళ ఓటమి: ట్రంప్ పార్టీ నుంచి పోటీ చేసినా వ్యతిరేక ఫలితం
కౌంటింగ్ ప్రక్రియ ఆగదు : ట్రంప్కు కౌంటర్
జో బైడెన్ క్యాంపెయిన్ మేనేజర్ జెన్ ఓ మాలీ డిల్లన్ మాట్లాడుతూ... 'కౌంటింగ్ ప్రక్రియను నిలిపివేయాలన్న ట్రంప్ ప్రకటన దారుణమైనది. ఆయన వ్యాఖ్యలు సరికాదు. ఒక రకంగా ఇది అమెరికన్ పౌరుల ప్రజాస్వామ్య హక్కులను హరించడమే..' అని మండిపడ్డారు. అంతేకాదు,ట్రంప్ భీంకారాలు పోయినంత మాత్రాన కౌంటింగ్ ప్రక్రియ ఆగదని పునరుద్ఘాటించారు.అంతకుముందు జో బోడైన్ మాట్లాడుతూ అధ్యక్ష ఎన్నికల్లో గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. చివరి ఫలితం వరకు వేచి చూద్దామని చెప్పారు.
పోటాపోటీ ప్రకటనలు...
బైడెన్ ప్రసంగం ముగిసిన కాసేపటికే ట్రంప్ మీడియా ముందుకు వచ్చి... తామే గెలిచామని ప్రకటించుకున్నారు. ఉదయం 4గం. తర్వాత కౌంటింగ్ ప్రక్రియను నిలిపివేయాలని మరోసారి డిమాండ్ చేశారు. కౌంటింగ్ ప్రక్రియ సుదీర్ఘంగా సాగితే అవకతవకలు జరిగే అవకాశం ఉందని ఆరోపిస్తున్న ట్రంప్... దీనిపై సుప్రీం కోర్టును ఆశ్రయించనున్నట్లు తెలిపారు. కరోనా నేపథ్యంలో ఈసారి పోస్టల్ బ్యాలెట్స్ ఓట్లు అధికంగా పోల్ అవడంతో... వాటి లెక్కింపు ప్రక్రియ ఆలస్యం కానుంది. పెన్సిల్వేనియా లాంటి రాష్ట్రాల్లో పోలింగ్ ముగిసిన తర్వాత పోస్టల్ బ్యాలెట్స్ వచ్చే అవకాశం ఉండటంతో... శుక్రవారం(నవంబర్ 6) వరకు కౌంటింగ్ కొనసాగనుంది. అయితే అధ్యక్షుడు ట్రంప్ మాత్రం ఈ సరళి సరైంది కాదని... తమ ప్రత్యర్థి వర్గం కుట్రలకు తెరలేపే అవకాశం ఉందని ఆరోపిస్తున్నారు.
2000 సంవత్సరంలో ఎన్నికలపై వివాదం...
ట్రంప్ సుప్రీంను ఆశ్రయిస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో 2000 నాటి పరిస్థితులను అమెరికన్లు మరోసారి గుర్తుచేసుకుంటున్నారు. అప్పట్లో ఎన్నికల ప్రక్రియ ముగిసి తుది ఫలితం రావడానికి దాదాపు నెల రోజులు పట్టింది. అది కూడా సుప్రీం కోర్టు జోక్యం చేసుకోవడంతోనే ఎన్నికల అధికారులు విజేతను ప్రకటించారు. ఫ్లోరిడా ఎన్నికల ఫలితంపై నెలకొన్న సందిగ్ధతతో అప్పట్లో తుది ఫలితం ఆలస్యమైంది. అప్పటి రిపబ్లికన్ అభ్యర్థి జార్జి డబ్ల్యూ బుష్కి అనుకూలంగా ఫ్లోరిడా ఎన్నికల అధికారులు వ్యవహరించారన్న ఆరోపణలున్నాయి. అప్పటి ఫ్లోరిడా గవర్నర్ జేబ్ బుష్, జార్జి డబ్లూ బుష్కు స్వయాన సోదరుడవడంతో.. ఎన్నికలను ఆయన ప్రభావితం చేశారన్న ఆరోపణలు వచ్చాయి.
అదే సీన్ రిపీట్ అవుతుందా..
ఈ నేపథ్యంలో ఫ్లోరిడా సుప్రీం కోర్టు రీకౌంటింగ్కి ఆదేశాలివ్వగా... దేశ సుప్రీం కోర్టు మాత్రం ఫలితాలను వెల్లడించాలని ఆదేశించింది. దీంతో ఫ్లోరిడాలోని 25 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు బుష్ ఖాతాలోకి వెళ్ళాయి. అప్పట్లో డెమోక్రాటిక్ అభ్యర్థి అల్ గొరేపై బుష్ 271-266 ఓట్ల తేడాతో విజయం సాధించారు. అయితే పాపులర్ ఓట్లు మాత్రం గొరేకి 48.4శాతం,జార్జి బుష్కు 47.9శాతం పోలయ్యాయి. తాజాగా ట్రంప్ కూడా కౌంటింగ్ను నిలిపివేయాల్సిందిగా సుప్రీంను ఆశ్రయిస్తానని ప్రకటించడంతో 2000 నాటి పరిస్థితులు రిపీట్ అవుతాయా అన్న చర్చ జరుగుతోంది.