కాశ్మీర్లో హింస దైవాజ్ఞ..సంచలన వ్యాఖ్యలు చేసిన హఫీజ్ సయీద్
ముంబై పేలుళ్ల సూత్రధారి లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. కాశ్మీర్లో హింస ఎందుకు సృష్టించాల్సి వస్తుందో... దాని అవసరం ఎందుకో వివరించాడు. పాకిస్తాన్లోని గఢాఫీ స్టేడియంలో తన మద్దతుదారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాశ్మీర్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.
" నూతన యుగం ప్రారంభమైంది. దైవానుగ్రహంతో కాశ్మీర్ ఒక కొత్త స్వతంత్ర రాష్ట్రంగా ఆవిర్భవిస్తుంది. ఇప్పటికే కాశ్మీర్ నేల రక్తంతో తడిసి ముద్దయ్యింది. దేవుడు ఇదంతా చూస్తున్నాడు. త్వరలోనే దీనిపై తీర్పు ఇవ్వనున్నాడు. కాశ్మీర్పై ప్రతి నిర్ణయం స్వర్గం నుంచే వస్తుంది కానీ... వాషింగ్టన్ నుంచి కాదు. దేవుడి దగ్గర నుంచి వచ్చే నిర్ఱయాలు కాశ్మీర్ను తిరిగి మామూలు స్థితికి చేర్చి ఒక కొత్త దేశంగా అవతరిస్తుంది." అని సయీద్ చెప్పుకొచ్చాడు.
హఫీజ్ సయీద్ స్థాపించిన లష్కరే తోయిబా కాశ్మీర్లోయలో అలజడి సృష్టించేందుకు ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందులో భాగంగానే అక్కడి స్థానిక యువతను లక్ష్యంగా చేసుకుని అక్కడి భద్రతా దళాలపై రాళ్లు రువ్వాల్సిందిగా నూరిపోస్తోంది. పాకిస్తాన్ షాడో ఐఎస్ఐగా వ్యవహరిస్తున్న లష్కరే తోయిబా సంస్థ... కాశ్మీర్లో రాళ్లు రువ్వుతున్న వారు, కాశ్మీరి ఉగ్రవాదులను గొప్పవారని పేర్కొంది.
కాశ్మీరీ కోసం పోరాడి ప్రాణాలు త్యాగం చేసిన యువతను అల్లా చూస్తున్నాడని చెప్పిన హఫీజ్... వారి చివరి శ్వాస సమయంలో కూడా కాశ్మీర్, పాకిస్తాన్లు కలిసి ఉండాలని ఆకాంక్షించారని చెప్పాడు. కాశ్మీర్లో కొత్త శకం ప్రారంభమైందని భారత ప్రధాని మోడీ ఈ పోరాటాన్ని ఆపలేరనే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఒక్క సారి దైవ నిర్ణయం జరిగితే ఎవరూ దాన్ని అడ్డుకోలేరని కాశ్మీర్పై ఇప్పటికే దైవ నిర్ణయం జరిగిపోయిందన్నారు.
ప్రస్తుతం హఫీజ్ సయీద్ తన నేతృత్వంలో ఏర్పడిన జమా-ఉద్ -దవా పార్టీ రానున్న పాకిస్తాన్ ఎన్నికల్లో పెద్ద ఎత్తున పాగా వేయాలని ప్రయత్నాలు ప్రారంభించారు. తమను గెలిపిస్తే ముస్లిం దేశాలన్నిటినీ ఏకమయ్యేలా చర్యలు తీసుకుంటామని హఫీజ్ హామీ ఇచ్చారు.