విషాదం: పులి దాడిలో జూ కీపర్ సమంత మృతి
హామిల్టన్: న్యూజిలాండ్లోని ఓ జూలో దారుణ ఘటన చోటు చేసుకుంది. జూలోని పులిని ఎంతో ప్రేమగా చూసుకునే ఓ సంరక్షకురాలిపైనే ఆ పులి దాడి చేసింది. దీంతో తీవ్రగాయాలపాలైన ఆమె మృతి అక్కడికక్కడే చెందింది. హామిల్టన్ జూలో జరిగిన ఈ ఘటనలో సంరక్షకురాలు సమంత కుడెవా(43) మృతి చెందింది.
హామిల్టన్ నగరంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న హామిల్టన్ జూలో విభిన్న జాతులకు చెందిన దాదాపు 600 జంతువులున్నాయి. ఆ జూ సంరక్షకుల్లో ఒకరైన సమంతను ఆదివారం ఉదయం 'ఓజ్' అనే మగ పులి చంపేసింది. అప్పటి వరకు ఔటర్ ఎంక్లోజర్ లో తిరిగిన పులిని.. ఇన్నర్ ఎంక్లోజర్లోకి పంపుతున్న సమయంలో ఈ సంఘటన జరిగింది.
ఇతర సిబ్బంది అక్కడికి చేరుకుని కాపాడేలోపే ఆమె కన్నుమూసింది. గురువారం వరకు జూను మూసేస్తున్నట్లు ప్రకటించిన అధికారులు దాడిపై విచారణకు ఆదేశించారు. సమంతకు భర్త, ఇద్దరు పిల్లలున్నారు.
ఆమె మరణం ఆ కుటుంబాన్ని విషాదంలోకి నెట్టింది. సమంతకు నివాళులు అర్పిస్తూ ఆమె ఇంటివద్దా, జూ గేటు వద్ద పుష్పగుచ్ఛాలతో నివాళులు అర్పిస్తున్నారు హామిల్టన్ వాసులు.
కాగా, సాలి అనే ఆడపులితో జతకట్టడం వల్ల ఇటీవలే రెండు పులి పిల్లలకు తండ్రయింది ఓజో. ఆ పిల్లలన్నా సమంతకు ఎంతో ఇష్టమని సహచరులు చెబుతున్నారు. అయితే, మనుషులను చంపడానికి అలవాటు పడిన ఈ పులిని ఏం చేయాలనేదానిపై అధికారులు చర్చలు జరుపుతున్నారు.