భారత్ ఆశలు గల్లంతు! అమెరికా అనుకూలమే.., చైనా, రష్యాలు అడ్డుపడుతున్నాయా?
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వ హోదా భారత్కు ఇప్పట్లో దక్కేలా లేదు. ఐక్యరాజ్యసమితిలో అమెరికా తరుపున రాయబారి నిక్కీ హేలీ తాజాగా చేసిన వ్యాఖ్యలు కూడా ఈ విషయాన్నే స్పష్టం చేస్తున్నాయి.
వాషింగ్టన్ : ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వ హోదా భారత్కు ఇప్పట్లో దక్కేలా లేదు. ఐక్యరాజ్యసమితిలో అమెరికా తరుపున రాయబారి నిక్కీ హేలీ తాజాగా చేసిన వ్యాఖ్యలు కూడా ఈ విషయాన్నే స్పష్టం చేస్తున్నాయి.
వీటో అధికారం జోలికి ఎవరినీ రానివ్వకూడదనే శాశ్వత సభ్యత్వ దేశాల వైఖరే భారత్కు శాశ్వత హోదా దక్కకపోవడానికి కీలక అంశంగా మారిందని హేలీ తెలిపారు. వాషింగ్టన్లో నిర్వహించిన భారత్ అమెరికా ఫ్రెండ్షిప్ కౌన్సిల్ సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు.
భద్రతా మండలి నిర్మాణంలో సంస్కరణలలో వీటో అధికారం ప్రధానంగా మారింది. ఇప్పటికే శాశ్వత సభ్యత్వ దేశాలైన రష్యా, చైనా, బ్రిటన్ అమెరికా, ఫ్రాన్స్ దేశాల్లో.. ఏ దేశం కూడా వీటో విషయంలో వేరే దేశం జోక్యాన్ని సహించలేకపోతున్నాయని ఆమె పేర్కొన్నారు.
ముఖ్యంగా రష్యా, చైనా దేశాలు భద్రతా మండలి నిర్మాణంలో సంస్కరణలను వ్యతిరేకిస్తున్నట్లు నేను గుర్తించాను. అందుకే భారత్ శాశ్వత హోదాకు ఇప్పుడు వీటో అంశమే కీలకంగా మారింది..' అని నిక్కీ హేలీ వ్యాఖ్యానించారు.
భారత్కు శాశ్వత హోదా కల్పించే విషయంలో తాము అనుకూలంగానే ఉన్నప్పటికీ అమెరికా కాంగ్రెస్కు గానీ, సెనేట్కుగానీ భద్రతా మండలిని సంస్కరించే పూర్తి అధికారాలు లేవని ఆమె వివరించారు.
'ఇది ఐక్యరాజ్యసమితికి సంబంధించిన విషయం. ఐక్యరాజ్యసమితికి చెందిన భద్రతామండలిలోని సంస్కరణ అంశం. ఇందులో మార్పు తీసుకురావాలని భారత్ బలంగా కోరుకుంటే మరిన్ని దేశాల మద్దతు తీసుకొచ్చుకోవడం ద్వారా అది సాధ్యం అవుతుందని నేను అనుకుంటున్నాను..' అని హేలీ చెప్పారు.