పసికందును కిడ్నాప్ చేసింది: సీసీ కెమెరాలు పట్టేశాయి(వీడియో)
హువనన్: ఓ పసికందును ఆస్పత్రికి వచ్చిన ఓ మహిళ కిడ్నాప్ చేసింది. ఆ దృశ్యాలు ఆ ఆస్పత్రి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. అంతేగాక, ఆమె ఆస్పత్రి నుంచి ఏయే ప్రాంతాలకు వెళ్లిందో అన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఉండటంతో ఆ దృశ్యాలన్నీ నమోదయ్యాయి. దీంతో కిడ్నాప్ కేసు అత్యంత వేగంగా ఛేదించారు అక్కడి పోలీసులు.
చైనాలోని హువనన్ కౌంటీలోని హిలాంగ్జియాంగ్ ప్రావిన్స్లో చోటు చేసుకున్న ఈ ఘటన ఇంటర్నెట్లో వీడియోగా హల్చల్ చేస్తోంది. వివరాల్లోకి వెళితే.. స్థానికంగా ఉన్న ఓ ఆస్పత్రిలోకి వెళ్లిన ఓ మహిళ.. మెటర్నిటీ వార్డులోని రెండు రోజుల పసికందును ఎత్తుకెళ్లిపోయింది.
బాలుడ్ని తీసుకుని బయటకు అక్కడే ఉన్న వాహనంలో వెళ్లిపోయింది. ఆ తర్వాత ఓ హోటల్ గదికి వెళ్లింది. అక్కడి నుంచి మరో వాహనంలో మరో చోటుకి వెళ్లింది. కాగా, ఆమె వెళ్లిన ప్రతీ చోటా సీసీ కెమెరాలుండటంతో ఆమె ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లిందనేది స్పష్టం తెలియవచ్చింది.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. సీసీ కెమెరాల ఆధారంగా ఆమెను తక్కువ సమయంలోనే పట్టుకున్నారు. కౌంటీ మొత్తాన్ని జల్లెడ పట్టిన మొత్తం 300మంది పోలీసులు.. గంటల్లోనే ఆ శిశువును ఆమె చెర నుంచి విడిపించారు. ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. శిశువును సురక్షితంగా ఆస్పత్రిలో అప్పగించారు.