Kim Jong Un: ఉత్తర కొరియాను వణికిస్తున్న కోవిడ్-అధికారులకు చక్కలు చూపిస్తున్న కిమ్ జోంగ్ ఉన్...
ఉత్తర కొరియాలో అసలు ఒక్క కరోనా కేసు కూడా నమోదవలేదంటూ గతంలో ప్రకటించుకున్న ఆ దేశం... ఇప్పుడు కేసుల సంఖ్య ఎక్కువై ఉక్కిరిబిక్కిరి అవుతోంది. పరిస్థితులు రోజురోజుకు దిగజారుతుండటంతో ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ తలపట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల పొలిట్ బ్యూరో సమావేశం నిర్వహించిన కిమ్ జోంగ్ ఉన్... వైరస్ కట్టడిలో విఫలమైన అధికారులను చెడా మడా వాయించినట్లు కొరియన్ మీడియా చెబుతోంది. పరుష పదజాలంతో వారిపై విరుచుకుపడ్డ కిమ్ జోంగ్... ఓ కీలక నేతను పొలిట్ బ్యూరో నుంచి తప్పించినట్లు అక్కడి మీడియా రిపోర్ట్ చేసింది.

అప్పుడే అనుమానాలు...
చైనాతో సరిహద్దును పంచుకునే ఉత్తరకొరియాలో ఒక్క కరోనా కేసు కూడా నమోదవలేదని ఆ దేశం ప్రకటించుకోవడంపై అప్పట్లో చాలామంది నిపుణులు అనుమానాలు వ్యక్తం చేశారు. ఉత్తర కొరియా ఉద్దేశపూర్వకంగానే కరోనా లెక్కలను దాచిపెడుతోందని భావించారు. ఆ అనుమానాలే ఇప్పుడు నిజమవుతున్నాయి. కేసుల సంఖ్య ఎక్కువవడం... దేశంలో పెద్దగా హెల్త్ కేర్ సదుపాయాలు లేకపోవడంతో ఉత్తర కొరియా అల్లాడుతోంది. వైరస్ కట్టడిపై చర్చించేందుకు ఇటీవల పొలిట్ బ్యూరో సమావేశాన్ని నిర్వహించిన కిమ్ జోంగ్ ఉన్ సీనియర్ అధికారులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

ఇద్దరిపై వేటు...?
కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ కథనం ప్రకారం... అధికారుల బాధ్యతారాహిత్యం,సరైన ప్రణాళిక,కార్యాచరణ లేకపోవడం వల్లే దేశానికి ఈ దుస్థితి తలెత్తిందని పొలిట్ బ్యూరో సమావేశంలో కిమ్ ధ్వజమెత్తారు. వైరస్ కట్టడికి వర్కర్స్ పార్టీ తీసుకున్న కీలక నిర్ణయాలను అమలుచేయడంలో ఉన్నతాధికారులు ఘోరంగా విఫలమయ్యారని ఆయన మండిపడ్డారు. అంతేకాదు,పొలిట్ బ్యూరోలోని ఓ కీలక నేతను కిమ్ తొలగించారు. వేటు పడ్డ ఆ నేత బహుశా జో యోంగ్ వొన్ అయి ఉండొచ్చునని దక్షిణ కొరియా సెజోంగ్ ఇన్స్టిట్యూట్కి చెందిన చెయోంగ్ చంగ్ అభిప్రాయపడ్డారు. కేబినెట్ ప్రీమియర్లోని కిమ్ టక్ హన్ అనే సభ్యుడిని కూడా తొలగించే యోచనలో కిమ్ ఉన్నట్లు తెలుస్తోంది. మిలటరీ ఉన్నతాధికారి రి ప్యోంగ్ చోల్ను కూడా కిమ్ తప్పించినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

అధికారులే బలిపశువులు...
ఉత్తర కొరియాలో లాక్డౌన్ నిబంధనలను ధిక్కరిస్తూ దేశ సరిహద్దుల గుండా అక్రమ వాణిజ్య కార్యకలాపాలు సాగుతున్నాయన్న విషయం కిమ్ దృష్టికి చేరింది. ఈ నేపథ్యంలోనే అధికారులపై ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడినట్లు తెలుస్తోంది. అయితే కిమ్ తన వైఫల్యాన్ని కప్పి పుచ్చుకునేందుకు అధికారులను బలిపశువులను చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తొమ్మిదేళ్ల తన పాలనలో కిమ్ జోంగ్ ఉన్ ప్రస్తుతం అత్యంత సంక్లిష్ట పరిస్థితులను చవిచూస్తున్నారు. ఓవైపు వైరస్ విజృంభణ... మరోవైపు ఆహార సంక్షోభం దిశగా దేశ పరిస్థితులు దిగజారుతుండటంతో కిమ్పై తీవ్ర ఒత్తిడి నెలకొంది. ఇలాంటి తరుణంలో ఉత్తర కొరియా చిరకాల మిత్ర దేశం చైనా సానుకూలంగా స్పందించింది. వైరస్ కట్టడిలో ఉత్తర కొరియాకు అవసరమైన సాయం అందిస్తామని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ వెన్బిన్ తెలిపారు.

సంక్షోభం దిశగా ఉత్తర కొరియా
ఉత్తర కొరియాలో ఒక్క కోవిడ్ కేసు కూడా నమోదు కాలేదని గతంలో డబ్ల్యూహచ్ఓకి ఆ దేశం నివేదిక సమర్పించింది. మరోవైపు కేసుల సంఖ్య ఎక్కువవడంతో లాక్డౌన్ సహా ఇతరత్రా ఆంక్షలను ఇప్పటికీ ఆ దేశం కొనసాగిస్తోంది. దీనికి తోడు ఈ ఏడాది వేసవిలో తుఫాన్లు,వరదల కారణంగా ఉత్తర కొరియా వ్యవసాయ ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. దీంతో ఉన్నపళంగా పరిస్థితిని చక్కదిద్దే మార్గాలు అన్వేషించాలని... వ్యవసాయ ఉత్పత్తులను పెంచేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని కిమ్ జోంగ్ అధికారులను ఆదేశించారు. మొత్తంగా ఉత్తర కొరియాకు మున్ముందు మరింత గడ్డు పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications