కొసావో పార్లమెంటులోనూ పెప్పర్ స్ప్రే దాడులు
ప్రిస్టినా: సెర్బియాతో కొసావో ఒప్పందాలను వ్యతిరేకిస్తూ గతకొన్ని రోజులుగా నిరసన తెలుపుతున్న ప్రతిపక్ష నాయకులు మంగళవారం పార్లమెంటులో బీభత్సం సృష్టించారు. అధికార పార్టీ సభ్యులపై కొందరు ప్రతిపక్ష సభ్యులు టియర్గ్యాస్, పెప్పర్ స్ప్రేలతో దాడికి పాల్పడ్డారు.
పోలీసులు వారికి అడ్డుగా నిలిచి ఈ దాడి నుంచి అధికారపార్టీ సభ్యులను కాపాడారు. మరోవైపు పార్లమెంటు వెలుపల నిరసనకారులు రాళ్లు రువ్వారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్షం లేకుండానే అధికారపక్ష సభ్యులు పార్లమెంటులో మరో గదిలో సమావేశాలను నిర్వహించుకున్నారు.
సెర్బియా నుంచి స్వాతంత్య్రం పొంది 2008లో దేశంగా ఏర్పడిన కొసావో.. యూరోపియన్ యూనియన్ మధ్యవర్తిత్వంతో పలు అంశాలపై తిరిగి సెర్బియాతో ఒప్పందాలు చేసుకోవడాన్ని ప్రతిపక్షం తప్పుబడుతోంది.
కాగా, ప్రతిపక్ష సభ్యుల చర్యను కొసావో ప్రధాని ఇసా ముస్తఫా తీవ్రంగా ఖండించారు. ఇది నేరపూరితమైన చర్య అని, బాధ్యులపై చర్య తీసుకుంటామని తెలిపారు. గతంలో మనదేశ పార్లమెంటులో కూడా అప్పటి కాంగ్రెస్ ఎంపి లగడపాటి రాజగోపాల్ పెప్పర్ స్ప్రే ఉపయోగించిన విషయం తెలిసిందే.