కరోనా విలయం: మోస్ట్ షాకింగ్ న్యూస్.. మాములు స్థితి ఎప్పుడో తెలుసా? ‘కంటేజియన్’ సినిమాలా..
భూగోళాన్ని చుట్టుముట్టిన కరోనా వైరస్ ఇప్పటిదాకా 25లక్షల మందికిపైగా సోకింది. అందులో చనిపోయినవారి సంఖ్య 2లక్షల దిశగా, రికవరీల సంఖ్య 7లక్షల దిశగా పయనిస్తోంది. అగ్రదేశం అమెరికాలో రికార్డు స్థాయిలో 8లక్షల మంది కరోనా కాటుకు గురికాగా, సుమారు 44వేల మంది చనిపోయారు. ఇటలీలో 25వేలు, స్పెయిన్ లో 21 వేలు, ఫ్రాన్స్ లో 20వేలు, యూకేలో 17 వేల మంది కన్నుమూశారు. ఇండియాలో మంగళవారం నాటికి కేసులు 20 వేల మార్కును దాటాయి. మరణాలు 641గా నమోదయ్యాయి. లాక్ డౌన్ ఎత్తివేతకు కొన్ని దేశాలు ప్రయత్నిస్తున్నా వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉండటం ఆ ప్రయత్నాలకు అడ్డంకిగా మారింది. అయితే ఈ పరిస్థితి ఇంకా ఎన్నాళ్లుంటుందనేదానిపై షాకింగ్ న్యూస్ వెల్లడైంది.

కంటేజియన్’ సినిమా చూశారా?
కరోనా వైరస్ వ్యాప్తిలోకి వచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా జనం ఎగబడి చూసిన సినిమా ‘కంటేజియన్'. అచ్చం కరోనా మాదిరిగానే.. ఆ సినిమాలో ‘ఎంఈవీ-1'పేరుగల వైరస్.. గబ్బిలం ద్వారా వ్యాప్తి చెంది మొదట ఓ పందికి, ఆ తర్వాత రెస్టారెంట్ ద్వారా మిగావాళ్లకు, అక్కణ్నుంచి ప్రపంచం మూలలకు వైరస్ సోకుతుంది. వ్యాక్సిన్ అందుబాటులోకి రానంతవరకూ విలయం కొనసాగుతూనే ఉంటుంది. ఆ సినిమాకు కన్సల్టెంట్ గా పనిచేసిన వ్యక్తి డాక్టర్ ఇయాన్ లిప్కిన్. ప్రఖ్యాత కొలంబియా యూనివర్సిటీలో ‘ఇన్ఫెక్షన్ అండ్ ఇమ్యూనిటీ' విభాగానికి డైరెక్టర్ గా పనిచేస్తున్న ఆయన.. వైరస్ల పుట్టుక, వాటి వ్యాప్తి గురించి గత 30 ఏళ్లుగా విపరీత ప్రయోగాలు చేశారు. అలాంటి వ్యక్తి చెప్పిన మాటనే ఇప్పుడు మనం షాకింగ్ న్యూస్ గా చదువుకుంటున్నాం..

అప్పటిదాకా ఇంతే..
సోషల్ డిస్టెంన్సింగ్, క్వారంటైన్, లాక్ డౌన్.. ఇలా ప్రస్తుతం అమలవుతోన్న విధానాలన్నీ వైరస్ వ్యాప్తిని నివారించడానికేతప్ప అసలు రోగానికి మందు కాదన్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే, వైరస్ కర్వ్ డౌన్ అయిపోతే.. లాక్ డౌన్ ఎత్తేయొచ్చనే ఆలోచన మరింత ప్రమాదకరమని డాక్టర్ ఇయాన్ లిప్కిన్ అభిప్రాయపడ్డారు. కొవిడ్-19 వ్యాధిని నయం చేసే వ్యాక్సిన్(మందు) కనిపెట్టడం ఒక్కటే కచ్చితమైన పరిష్కారమని, అప్పటిదాకా ఈ భూమ్మీద మామూలు పరిస్థితుల నెలకొనే అవకాశమేలేదని ఆయన స్పష్టం చేశారు.

ల్యాబ్లో లీకేజీపై..
మందు కనిపెట్టడం ఒక్కటే కరోనా వైరస్ కు విరుగుడన్న డాక్టర్ లిప్కిన్... అప్పటిదాకా లాక్ డౌన్ కొనసాగించడం దేశాలకు సవాలు అవుతుందని, పేదలు ఎక్కువగా ఉండే ఇండియా లాంటి దేశాల్లో పరిస్థితి భయానకంగా మారే అవకాశముందని, కాబట్టి మినహాయింపులు కల్పిస్తూ, దశలవారీగా లాక్ డౌన్ ఎత్తేస్తూ వైరస్ వ్యాప్తిని నియంత్రణలో ఉంచుకోవాలని సూచించారు. చైనాలోని వూహాన్ వైరాలజీ ల్యాబ్ ద్వారా కరోనా వైరస్ లీకైందనడానికి కచ్చితమైన ఆధారాలేవీ లేవని ఆయన చెప్పారు ఈ వైరస్ జన్యుపరంగా గబ్బిలాల నుంచి వచ్చిందేనని, ప్రపంచం మొత్తంలో మిలియన్ అంతకంటే ఎక్కువ వైరస్ లు ఉన్నాయని, వాటిలో కొన్ని మాత్రమే మహమ్మారులుగా మారి మనుషుల ప్రాణాలను హరిస్తాయని వివరించారు.
Recommended Video

మందుల తయారీ ఎంతదాకా?
మందు కనిపెట్టేదాకా మామూలు పరిస్థితులు రాబోవన్న డాక్టర్ ఇయాన్ లిప్కిన్ హెచ్చరికల నేపథ్యంలో వ్యాక్సిన్ ప్రయోగాలు మరింత జోరందుకున్నాయి. ఇండియాతోపాటు అమెరికా, జపాన్, చైనా తదితర దేశాలు కొవిడ్-19 కు వ్యాక్సిన్ కనిపెట్టే పనిలో బిజీగా ఉన్నాయి. యాంటీవైరల్ ఔషధమైన ‘ఫవపిరవిర్'ను కొవిడ్ వ్యాధికి విరుగుడులా వాడేదానిపై చైనా, జపాన్ ప్రయోగాలు చేస్తున్నాయి. చైనాలో మనుషులపై క్లినికల్ టెస్టులు రెండో దశకు చేరాయి. అటు, అమెరికాలోని బయో, ఫార్మా కంపెనీలు కొన్ని సీరియస్ గా పనిచేస్తున్నాయి. ఇప్పటికే పలు కంపెనీలు మనుషులపై ప్రయోగాలు మొదలుపెట్టాయి. ఇండియాలోనూ టీసీఎస్ లాంటి కంపెనీలు కొవిడ్-19 వ్యాక్సిన్ వేటలో ఉన్నాయి. ఏదిఏమైనా వ్యాక్సిన్ అందుబాటులోకి రావడానికి కచ్చితంగా కొన్ని నెలలు పడుతుంది. అప్పటిదాకా నియంత్రణ ఒక్కటే శ్రీరామరక్ష.












Click it and Unblock the Notifications