డొక్లాం వద్ద చైనా బలగాల సంఖ్య తగ్గింది, చాణక్య నీతిపై దృష్టి పెట్టాలి: ఆర్మీ చీఫ్ జనరల్
న్యూఢిల్లీ: డొక్లాం వద్ద చైనా బలగాలు తగ్గాయని భారత ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ సోమవారం వ్యాఖ్యానించారు. సరిహద్దుల్లో సాధారణ పరిస్థితి నెలకొన్నదని చెప్పారు.
అర్థశాస్త్రం, చాణక్య నీతి వైపు సైన్యం దృష్టిపెట్టాల్సిన సమయం వచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు. భద్రతా దళాల ఆధునికీకరణ అత్యావశ్యకమన్నారు. భవిష్యత్లో జరిగే యుద్ధాలు మరింత విపత్కర పరిస్థితుల మధ్య జరిగే అవకాశాలున్నందున సైన్యంలోని ప్రతి ఆయుధం, ప్రతి విభాగం ఆధునికీకరణ కోసం ఎదురుచూస్తున్నదన్నారు.
ఢిల్లీలో సోమవారం నిర్వహించిన ఆర్మీ టెక్నాలజీ సెమినార్లో రావత్ పాల్గొని ప్రసంగించారు. మన భద్రతా దళాల్లోని ప్రతి విభాగాన్ని ఆధునీకరించడం అత్యవసరంగా మారిందని, భవిష్యత్లో చాలా కష్టతరమైన ప్రదేశాల్లో, పరిస్థితుల్లో యుద్ధాలు జరిగే అవకాశం ఉందని, అందుకోసం మనమంతా సిద్ధంగా ఉండాలని చెప్పారు. ప్రభుత్వం ఆర్మీకి సహకరిస్తే టెక్నాలజీని మరింత సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చునని చెప్పారు.
అతి తక్కువ బరువుగల బుల్లెట్ ప్రూఫ్ మెటీరియల్తో పాటు ఫ్యూయెల్ సెల్ టెక్నాలనజీ కోసం మంచి ముందడుగు పడిందని, ఇప్పటికే మొదలైన ఈ ప్రయాణం ఇక ముందు కూడా కొనసాగాలని చెప్పారు.
పరిశ్రమల నుంచి మనకు మద్దతు దొరికితే వాళ్లు అందించే టెక్నాలజీని అందుకుని మనం మరింత వేగంగా ముందుకెళ్లగలమని కచ్చితంగా చెప్పగలనని జనరల్ రావత్ అన్నారు. డిఫెన్స్ టెక్నాలజీని దిగుమతి చేసుకోవడం క్రమంగా తగ్గించాలనుకుంటున్నామనీ, మనలాంటి దేశాలు స్వదేశంలో తయారైన ఆయుధాలతోనే యుద్ధం చేయాల్సిన సమయం వచ్చిందన్నారు.