ఇంగ్లాండ్లో ఘోర రోడ్డు ప్రమాదం: 8 మంది భారత టెక్కీల మృతి
దక్షిణ ఇంగ్లాండ్లో గత శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 8మంది భారతీయులు మరణించారు. మొత్తం మృతుల్లో ఆరుగురు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారు.
లండన్: దక్షిణ ఇంగ్లాండ్లో గత శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 8మంది భారతీయులు మరణించారు. మొత్తం మృతుల్లో ఆరుగురు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. తీవ్రంగా గాయపడిన ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వీరిలో ఐదేళ్ల చిన్నారి ఉంది.
మృతుల్లో ముగ్గురు 'విప్రో'లో, మరో ముగ్గురు నాటింగ్హ్యాంకు చెందిన 'క్యాపిటల్ వన్'సంస్థలో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. 11మంది ఓ మినీవ్యానులో నాటింగ్హ్యాం నుంచి లండన్ వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
ప్రమాదంలో చనిపోయిన కార్తికేయన్ రామసుబ్రమణియం పుగలూర్, రిషీరాజీవ్కుమార్, వివేక్ భాస్కరన్లు ముగ్గురూ విప్రో ఉద్యోగులేనని సంస్థ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. తీవ్రంగా గాయపడినవారిలో మరో విప్రో ఉద్యోగి మనోరంజన్ పన్నీర్సెల్వం ఉన్నారు.
రెండు ట్రక్కుల మధ్య మినీవ్యాను ఇరుక్కుని నుజ్జునుజ్జయిందని, ట్రక్కుడ్రైవర్ల నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. ఫ్రాన్స్కు వెళ్లే వాహనాన్ని చేరుకునేందుకు వీరంతా మినీవ్యానులో బైలుదేరినట్లు వెల్లడించారు. మరణించిన మినీబస్సు డ్రైవరూ భారతీయుడేనని పోలీసులు తెలిపారు.