డిలీట్.. కంపెనీ ఔట్! నిజమేనా? పబ్లిసిటీ కోసమేనా??
కంప్యూటర్ కీబోర్డులోని ‘డిలీట్’ బటన్ ఎంతటి ఉపద్రవాన్ని సృష్టిస్తుందో వివరించే కథనమిది. కంప్యూటర్ వినియోగదారులందరూ చదివి జాగ్రత్త పడాల్సిన విషయం కూడా. . చదవండి.
వాషింగ్టన్: కంప్యూటర్ కీబోర్డులోని 'డిలీట్' బటన్ ను పరధ్యానంలో నొక్కేసి ఆ తర్వాత 'అయ్యయ్యో..'అనుకోవడం నెటిజన్లకు పరిపాటి. ఒక్కసారి డిలీట్ బటన్ నొక్కిన తరువాత ఎంత మొత్తుకున్నా ప్రయోజనం ఉండదు మరి.
అమెరికాకు చెందిన మార్కో మర్సాలా అనే ఐటీ నిపుణుడు కూడా ఇలాగే పొరపాటున 'డిలీట్' బటన్ నొక్కేసి కోట్ల రూపాయల విలువైన కంపెనీని నామరూపాలు లేకుండా చేసేసుకున్నాడు.
మర్సాలా కంపెనీకి సంబంధించిన సకల సమాచారమూ అతడి ల్యాప్ టాప్ లోనే ఉంది. అతడు చేసిన పనితో వందల కోట్ల విలువైన కంప్యూటర్ ప్రోగ్రామింగ్ కంపెనీ కాస్తా రెప్పపాటు కాలంలో శాశ్వతంగా 'డిలీట్' అయిపోయింది.
సాధారణంగా డేటాను తొలగించే ముందు మరొక్కసారి నిర్ధారించుకోమంటూ కంప్యూటర్ స్క్రీన్ పై సూచన కనిపిస్తుంది. అయితే మితిమీరిన ఆత్మవిశ్వాసంతో అలాంటి హెచ్చరిక వ్యవస్థ కూడా లేకుండా ప్రత్యేకంగా ప్రోగ్రాం రాసుకున్నాడు మర్సాలా.
దీంతో ఆ ఉత్పాతాన్ని ఏ టెక్నాలజీ కూడా ఆపలేకపోయింది. కొంప కొల్లేరయిందని గ్రహించిన మర్సాలా ఏం చేయాలో అర్థం కాక జరిగింది వివరిస్తూ నెటిజన్ల సహాయం కోరాడు.
ఏం చేస్తే నా కంపెనీ సమాచారం తిరిగొస్తుంది? అన్న మనోడి ప్రశ్నకు దాదాపుగా సమాధానాలన్నీ నెగెటివ్ గానే వచ్చినట్లు సమాచారం. అయితే ఉన్నట్లుండి మర్సాలా 'ఏప్రిల్ ఫూల్' అనేశాడు.
రిపబ్లికా అనే ఇటాలియన్ ప్రతికకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో 'ఇదంతా నిజం కాదు.. పబ్లిసిటీ కోసమే ఈ కథ సృష్టించా..' అని పేర్కొన్నాడు. అయితే ఇలాంటి ఘటన ఒకటి నిజంగానే 2006 లో జరిగిందని, సదరు బాధితుడిని తాను వ్యక్తిగతంగా కూడా కలిశానని చెప్పాడు.
మరి, మార్కో మర్సాలా చెప్పేది నిజమో, అబద్ధమో అర్థం కావడం లేదు. కానీ ఇలా జరగడానికి మాత్రం ఆస్కారం ఉందనే విషయం కంప్యూటర్ వినియోగదారులందరికీ అర్థమైంది. ఏదిఏమైనా 'డిలీట్' బటన్ తో జాగ్రత్తగా ఉండడమే మేలు.. కదూ?