వణికించిన పెను భూకంపం - 20 మందికి పైగా మృతి.!!
జకర్తా: ఇండోనేషియాలో పెను భూకంపం సంభవించింది. జావా ద్వీపాన్ని అల్లకల్లోలానికి గురి చేసింది. ఈ భూకంప తీవ్రత అనూహ్యంగా నమోదైంది. దీని తీవ్రతకు భారీ భవనాలు నేలమట్టం అయ్యాయి. ఇప్పటివరకు 20 మందికి పైగా దుర్మరణం పాలయ్యరు. 300 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఫలితంగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదు.'
{video1}
జావా పశ్చిమ ప్రాంతంలో గల సియాంజుర్ రీజెన్సీలో ఈ ఉదయం 11:51 నిమిషాలకు ఈ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.6గా నమోదైంది. ప్రధాన భూకంపం తరువాత కూడా ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. దీని తీవ్రత రాజధాని జకార్తాపైనా పడింది. అక్కడా పలు భవనాలు కంపించాయి. వాటి కిటికీ అద్దాలు పగిలిపోయాయి. కొన్ని సెకెండ్ల పాటు ప్రకంపనాల తీవ్రత కనిపించినట్లు బదాన్ మెటెరాలజీ, క్లైమెటాలజీ, జియాలాజికల్ ఏజెన్సీ తెలిపింది.

సియాంజుర్కు పశ్చిమ దిశగా గల ప్రదేశాన్ని భూకంప కేంద్రంగా గుర్తించినట్లు వివరించింది. ఉపరితలం నుంచి 10 కిలోమీటర్ల లోతున ఫలకాల్లో చోటు చేసుకున్న మార్పుల వల్ల భూమి కంపించినట్లు పేర్కొంది. తీర ప్రాంతమే అయినప్పటికీ- సునామీ భయాలు లేవని స్పష్టం చేసిందా జియాలాజికల్ ఏజెన్సీ. సునామీ హెచ్చరికలను జారీ చేయలేదని తెలిపింది. తీర ప్రాంత ప్రజల్లో సునామీ భయాందోళనలు నెలకొన్నాయనే విషయం తమ దృష్టికి వచ్చినట్లు స్పష్టం చేసింది.
భూమి కంపించిన వెంటనే స్థానికులు తమ నివాసాలు, కార్యాలయాలను వదిలి పెట్టి బయటికి పరుగులు తీశారు. షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్లను ఖాళీ చేయడం కనిపించింది. ప్రధాన భూకంపం తరువాత కూడా పలు ప్రకంపనలు నమోదు కావడంతో వెనక్కి వెళ్లడానికి ఇష్టపడలేదు. మధ్యాహ్నం వరకూ రోడ్ల మీదే గడిపారు. భూమి ప్రకంపించిన సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియలో వైరల్గా మారాయి.
కాగా- రింగ్ ఆఫ్ ఫైర్లో ఉన్న దేశాల్లో ఇండొనేషియా కూడా ఒకటి. తరచూ ఇక్కడ భూకంపాలు సంభవిస్తోంటాయి. దీనితో పాటు బొలీవియా, చిలీ, ఈక్వెడార్, పెరూ, కోస్టారికా, గ్వాటెమాలా, మెక్సికో, అమెరికా, కెనడా, రష్యా, జపాన్, ఫిలిప్పీన్స్, న్యూజిలాండ్, అంటార్కిటికా దేశాలు రింగ్ ఆఫ్ ఫైర్లో ఉన్నాయి.












Click it and Unblock the Notifications