ఇరాన్ పై కనీవినీ ఎరుగని భీకర దాడి: అమెరికా- ఇజ్రాయెల్ జాయింట్ ఆపరేషన్ షురూ
నిన్నటివరకు నివురు గప్పిన నిప్పులా ఉంటూ వచ్చిన ఇరాన్- ఇజ్రాయెల్ సంక్షోభం ఇప్పుడు ఒక్కసారిగా భగ్గుమంది. ఇరాన్ పై ఇజ్రాయెల్ భీకర దాడికి దిగింది. ఏకంగా ఆ దేశ రాజధాని టెహ్రాన్ పై మిస్సైళ్లు, డ్రోన్ బాంబులతో విరుచుకుపడుతోంది. అమెరికాతో కలిసి ఇజ్రాయెల్ ప్రారంభించిన జాయింట్ ఆపరేషన్ ఇది. టెహ్రాన్ లో వరుస పేలుళ్లు సంభవిస్తోన్నాయి. దట్టమైన పొగలు ఆ నగరాన్ని ఆవరించింది. ఎప్పుడేం జరుగుతుందో, ఎక్కడ ఏ బాంబు పడుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి.
ఊహించని ఈ ఘటనతో ఇరాన్ ఉలిక్కిపడింది. ప్రాణాలను అరచేతిలో పట్టుకుని బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారు అక్కడి జనం. అటు ఇజ్రాయెల్లో కూడా భయాందోళనలు వ్యక్తమౌతోన్నాయి. ఇరాన్ మిస్సైల్ దాడులకు పాల్పడుతుందనే ఆందోళనలు నెలకొన్నాయి. యుద్ధ సైరన్లు సైతం మోగాయక్కడ. సరిహద్దులతో పాటు గగనతలాన్ని ఇజ్రాయెల్ మూసివేసింది. కొన్ని పౌర విమానాలను దారి మళ్లించింది. పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని ఇజ్రాయెల్ హెచ్చరించింది.

ఇరాన్ రాజధాని టెహ్రాన్ డౌన్టౌన్లో భారీ పేలుడు జరిగి దట్టమైన పొగ అలముకుంది. పలు చోట్ల పేలుడు శబ్దాలు వినిపించాయి. అమెరికా-ఇరాన్ అణు చర్చల మధ్య ఈ ఘటన ప్రాంతీయ ఉద్రిక్తతలను మరింత తీవ్రతరం చేసింది. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఈ దాడులను ధృవీకరించారు కూడా. వీటిని నివారించదగ్గ సైనిక చర్యగా అభివర్ణించారు. ప్రీవెంటివ్ మిస్సైల్ అటాక్ ను ప్రారంభించినట్లు తెలిపారు. అమెరికా మద్దతు ఉందా లేదా అనేది వెల్లడించడానికి నిరాకరించారు.
తొలుత టెహ్రాన్ లో మూడు వరుస పేలుళ్లు సంభవించాయి. ఆ వెంటనే నగర శివార్లతో పాటు అంతర్జాతీయ విమానాశ్రయం సమీప ప్రాంతాలు బాంబుల మోతలతో మార్మోగిపోయాయి. దీని తరర్వాత టెహ్రాన్లో మరో రెండు చోట్ల బాంబులు పేలినట్లు లోకల్ మీడియా తస్నిమ్ వెల్లడించింది. దీంతోపాటు యూనివర్శిటీ స్ట్రీట్, జోమ్హౌరి ప్రాంతాన్ని అనేక క్షిపణులు ఛిన్నాభిన్నం చేశాయి.
టెహ్రాన్ డౌన్టౌన్లోని పాశ్చర్ స్ట్రీట్ పరిసరాల నుండి దట్టమైన పొగ పైకి లేచిందని స్థానిక మీడియాను ఉటంకిస్తూ వార్తా సంస్థ రాయిటర్స్ నివేదించింది. నార్త్ సయ్యద్ ఖాందాన్ ప్రాంతంలోనూ దాడులు జరిగినట్లు సమాచారం అందిందని పేర్కొంది. పశ్చిమ ఆసియా ఇప్పటికే ఉద్రిక్తంగా ఉంది. ఇజ్రాయెల్ చర్య, టెహ్రాన్ పేలుళ్లు పరిస్థితిని తీవ్రతరం చేశాయి.












Click it and Unblock the Notifications